గిరిజనులపై అడవి జంతువుల కంటే క్రూరంగా దాడి 

నాగర్‌కర్నూల్ జిల్లాలోని అటవీ ప్రాతంలో గిరిజనులపై జరిగిన దాడిని రాష్ట్ర బీజేపీ మహిళా నేత విజయశాంతి తీవ్రంగా ఖండించారు. గిరిజనులపై అడవి జంతువుల కంటే క్రూరంగా దాడి జరిగిందని, ఆ దాడి జరిగి రెండు రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం ఏంటని మండిపడ్డారు. 
 
ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. తెలంగాణలోని గిరిజనుల పట్ల అడవి జంతువుల కంటే క్రూరంగా, హీనంగా, దాడి జరిగి రెండు రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఆమె ధ్వజమెత్తారు. 
నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన కొందరు గిరిజనులు ఇప్పపూల కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లి రాత్రి పొద్దుపోవడంతో అక్కడే నిద్రపోవడం వారి పాలిట శాపమైంది. అదేదో మహాపాపం అన్నట్టు అటవీ శాఖ సిబ్బంది ఆ గిరిజనులపై దాడి చేసి పెద్దాచిన్నా, మహిళలు, పురుషులని చూడకుండా బూటుకాళ్లతో తన్ని జననాంగాలను గాయపరిస్తే ఉన్నతాధికారులు మాత్రం తూతూమంత్రంగా పరామర్శించి వెళ్ళిపోయారని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు.
అడవి తల్లిని ఆశ్రయించుకుని బతుకుతున్న గిరిజన బిడ్డలు మీకేం అపకారం చేశారు? అగ్ని ప్రమాదాలంటూ గిరిజనులకు అటవీ ఉత్పత్తులు దక్కకుండా చేస్తే వారెలా బతకాలి? అటవీ అధికారులు, గిరిజనుల మధ్య ఎప్పటి నుంచో నలుగుతున్న ఈ సమస్యకు పరిష్కారం కోసం బాధ్యతగల పాలకులుగా మీరు చూపిన ప్రత్యామ్నాయమేంటి?  అంటూ ఆమె ప్రశ్నించారు.
అసలు అడవుల పరిరక్షణకు తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలేమిటి? అని ఆమె నిలదీశారు. ఒక్కసారి ఈ లెక్కలన్నీ తీస్తే సర్కారు చేతగానితనమంతా బయటపడుతుందని ఎద్దేవా చేశారు. ఇదంతా చాలక మరోవైపు డిచ్‌పల్లి మండలం యానంపల్లి తండాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉన్న బీజేపీ గిరిజన మోర్చా నేతలపై టీఆరెస్ నేతలు దాడికి పాల్పడ్డారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొన్నటికి మొన్న గుర్రంపోడు భూముల వ్యవహారంలోనూ అధికార పార్టీది ఇదే తీరు. గిరిజనుల భూముల్ని ఆక్రమించుకోవడమే కాకుండా ప్రశ్నించినందుకు బీజేపీ నేతలపై దాడులు చేయించి, జైలుకు పంపి పైశాచికానందం పొందారు. చివరికి జర్నలిస్టులనూ మీరు వదల్లేదని ఆమె దుయ్యబట్టారు. గిరిజనులపై మీరు కక్షకట్టారా?  అంటూ ఆమె నిలదీశారు. తెలంగాణలో ఎక్కడ చూసినా దాడుల విష సంస్కృతిని పెంచి పోషిస్తున్న అధికార పార్టీని వారి చర్యలే సర్పాలై కాటేయడం ఖాయం అని విజయశాంతి తన పోస్టులో హెచ్చరించారు.