రెండేళ్లలో కోటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు 

రానున్న రెండేళ్లలో కోటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ఇంధనశాఖ కార్యదర్శి తరుణ్‌ కపూర్‌ చెప్పారు. వంటగదిలో మహిళలు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం తెచ్చిందని, దాని కిందే వీటిని ఇవ్వనున్నట్లు చెప్పారు. 
 
ఇటీవల ప్రవేశ పెట్టిన 2021–22 బడ్జెట్‌లోనూ ఆర్థిక మంత్రి దీని ప్రస్తావన తీసుకొచ్చారు. రెండేళ్లలో కోటి కనెక్షన్లు ఇస్తామని మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అయితే దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీనిపై తరుణ్‌ స్పందిస్తూ.. ఒక్కో కనెక్షన్‌కు ఖర్చయ్యే రూ. 1,600లను సబ్సీడీ ద్వారా పూడ్చుకోవచ్చని, బడ్జెట్‌లో కేటాయించకపోయాన ఫరవాలేదని స్పష్టం చేశారు.
కనెక్షన్లు ఇచ్చేందుకు ఉన్న నిబంధనలను సులభతరం చేసినట్లు చెప్పారు. అంతేగాక గ్యాస్‌ అయిపోయాక దగ్గర్లోనే ఉన్న డీలర్లను సంప్రదించి, నింపుకునేలా మూడు డీలర్లతో ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలిపారు.
గత నాలుగేళ్లలో 8 కోట్ల ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. తరచుగా ఊర్లు మారే వారికి కూడా ఎల్పీజీ కనెక్షన్లు దొరికేలా నిబంధనలు సరళతరం చేయాల్సిందిగా ఆయిల్‌ కంపెనీలను కోరినట్లు తెలిపారు. దీని కోసం మూడు కంపెనీలతో కలసి ఓ ఐటీ బేస్డ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.