అంబానీ కుటుంబానికి బెదిరింపులో ఉగ్రవాద కోణం 

రిలయన్స్ దిగ్గజం ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో ఈ కేసులో ఉగ్రవాద కోణాన్ని పరిశోధించడానికి మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్(ఏటీఎస్), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారులు రంగంలోకి దిగారు. 
 
పేలుడు పదార్థాలున్న కారును ముకేశ్ అంబానీ ఇల్లు అంటెల్లా వద్ద వదిలి ఆగంతకుడు పారిపోయిన ఘటనతో అప్రమత్తమైన ముంబై పోలీసులు హైప్రొఫైల్ కేసును ఛేదించడానికి యత్నిస్తున్నారు. ఉన్నతస్థాయి కేసు దర్యాప్తు కోసం ముంబై పోలీసులు 10 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.
 
ఈ కేసును తప్పు దోవ పట్టించేలా నిందితులు స్పెల్లింగ్ తప్పిదాలతో బెదిరింపు లేఖను ముద్రించారని పోలీసులు గుర్తించారు. చేతిరాత నిపుణుల సహాయంతో ఎవరు రాశారనేది గుర్తించకుండా బెదిరింపు లేఖను ముద్రించారని ముంబై పోలీసులు చెప్పారు. ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలున్న కారును వదిలిన కేసులో 15 మంది అనుమానితులను ప్రశ్నించారు. వందలాది సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. దీనికోసం వాడిన రెండు కార్లను గుర్తించి ఇవి థానే నుంచి వచ్చాయని గుర్తించారు. 
 
ఆ వాహనాల్లో నుంచి 20 గెలాటిన్ స్టిక్స్‌‌తోపాటు కొన్ని నంబర్ ప్లేట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొన్ని నంబర్ ప్లేట్లు అంబానీ కుటుంభంకు చెందిన భద్రతా బృందం ‌ వాడిన నంబర్ ప్లేట్లను పోలి ఉన్నాయని తెలుస్తోంది.  ఈ కారు దొంగలను గుర్తించడంతోపాటు కారు వదిలిన స్థలంలో మొబైల్ డాటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. పేలుడుపదార్థాలు వదిలిన కారులోని వ్యక్తి ముకేశ్ అంబానీ ఇంటి బయట ఇన్నోవాలోకి ఎక్కి పారిపోయాడని పోలీసులు గుర్తించారు.