ఓటుకు నోటు కేసులో అభియోగాలు నమోదు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నిందితులపై ఎసిబి  కోర్టు అభియోగాలు నమోదు చేసింది. మంగళవారం జరిగిన విచారణలో రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ లపై అభియోగాలు నమోదు చేసింది. గతంలోనే సండ్ర వెంకటవీరయ్యపై అభియోగాలను కోర్ట్ నమోదు చేసింది. 

ఇవాళ రేవంత్ తదితరులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 కింద ఈ అభియోగాల నమోదు చేసింది. ఐపీసీ 120 (బి) రెడ్ విత్ 34 అభియోగం నమోదైంది. తమపై అభియోగాల్లో వాస్తవం లేదని రేవంత్, సెబాస్టియన్, ఉదయ్ సింహా తోసిపుచ్చారు.  అయితే ఈ నెల 19న సాక్షుల విచారణ షెడ్యూలు ఖరారు చేస్తామని ఏసీబీ కోర్టు ప్రకటించింది.

తమ పేర్లను ఈ కేసు నుంచి తొలగించాలంటూ ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, హ్యారీ సెబాస్టియన్‌లు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్‌ పిటిషన్లను  న్యాయస్థానం ఇదివరకే కొట్టివేసింది.  ఓటుకు కోట్లుకు సంబంధించి అన్ని ఆధారాలున్న ఉన్నాయని ఏసీబీ తెలిపింది.

ఆడియో, వీడియో టేపులతో సహా అన్ని ఆధారాలున్నాయని పేర్కొంది. రూ.50లక్షలు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా నిందితులు పట్టుబడ్డారని ఏసీబీ తెలిపింది.  ఈనెల 19న సాక్షుల విచారణ, షెడ్యూలును ఖరారు చేస్తామని ఏసీబీ కోర్టు పేర్కొంది.