న్యాయ వ్యవస్థ ఎల్లప్పుడూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది 

దేశ ప్రజల హక్కులను కాపాడటమైనా, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వవలసిన పరిస్థితి ఉత్పన్నమైనపుడైనా, న్యాయ వ్యవస్థ ఎల్లప్పుడూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. 
 
గుజరాత్ హైకోర్టు వజ్రోత్సవాల సందర్భంగా శనివారం మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడుతూ మన దేశ న్యాయ వ్యవస్థ మన రాజ్యాంగాన్ని స్పష్టంగా, నిర్ద్వంద్వంగా వివరిస్తోందని, ఫలితంగా రాజ్యాంగం మరింత బలపడుతోందని చెప్పారు. హైకోర్టు వజ్రోత్సవాల సందర్భంగా ప్రత్యేక పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేశారు. 
 
మన రాజ్యాంగాన్ని రూఢిగా, నిశ్చయంగా, నిర్ద్వంద్వంగా, ఖండితంగా, సృజనాత్మకంగా న్యాయ వ్యవస్థ వివరిస్తోందని ప్రధాని మోదీ  చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులను విచారించిందని న్యాయవ్యవస్ధపై ప్రశంసలు గుప్పించారు. హైకోర్టులు, జిల్లా కోర్టులు సైతం కొవిడ్‌ సమయంలో పెద్దసంఖ్యలో ఈ- ప్రొసీడింగ్స్‌ చేపట్టాయని గుర్తుచేశారు.
గుజరాత్ హైకోర్టు సత్యం, న్యాయాలను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తోందని  అభినందించారు. న్యాయపరమైన అవగాహన, పాండిత్యం, మేధాశక్తి వంటివాటితో గుజరాత్ హైకోర్టు, బార్ తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించాయని కొనియాడారు.

న్యాయం కోసం అంకితభావంతో, కర్తవ్యబద్ధతతో గుజరాత్ హైోర్టు పని చేస్తోందని, రాజ్యాంగ విధుల నిర్వహణకు నిరంతరం సంసిద్ధంగా ఉంటోందని, వీటి వల్ల మన దేశ న్యాయ వ్యవస్థతోపాటు ప్రజాస్వామ్యం బలపడుతోందని చెప్పారు. న్యాయ శాస్త్ర నియమాలకు కట్టుబడి ఉండాలనే దృక్పథం అనేక శతాబ్దాల నుంచి భారతీయ నాగరికతకు ప్రాతిపదిక అని పేర్కొన్నారు. 

సుపరిపాలన మూలాలు న్యాయాన్ని అందజేయడంలోనే ఉంటాయని మన ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాని తెలిపారు. ప్రపంచ స్థాయి న్యాయ వ్యవస్థను మన దేశంలో నిర్మించేందుకు బార్, జ్యుడిషియరీ కృషి చేయాలని సూచించారు.