ఏపీలో దేవాలయ దాడులపై ధర్మాచార్యుల ఆగ్రహం  

ఆంద్ర ప్రదేశ్  లో గత సంవత్సర కాలంగా  దేవాలయ వ్యవస్థ మీద , పవిత్ర దేవతామూర్తుల మీద ఓ పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయని అంటూ పలువురు ధర్మాచార్యుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
  దేవాలయ వ్యవస్థను రక్షించటం  దైవాపచారాలకు పాల్పడే దుండగులను కఠినంగా శిక్షించటం ఫ్రభుత్వ ధర్మం అని స్పష్టం చేశారు. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు ధర్మాచార్యులు తమకేమీ పట్టనట్టు  మిన్నకుండజాలరని హెచ్చరించారు . రాజ్యాంగాన్ని అపహసించి, ఒక మతం పట్ల పక్షపాతంతో హిందూ మతాన్ని మట్టుపెట్టే వినాశకర ధోరణిని  ప్రస్తుత పాలకులు తక్షణం విడనాడాలని ధర్మాచార్యులు హితవు చెప్పారు.
 
ఫిబ్రవరి 3 బుధవారం నాడు తిరుపతికి 56 కి.మీ.ల దూరంలోని తమిళనాడుకు చెందిన  పోన్పాడి గ్రామంలో జరిగిన
సనాతన ధర్మ పరిరక్షణ సదస్సులో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  సనాతన ధర్మాన్ని అనుసరించే అనేక మతశాఖలకు, సంప్రదాయాలకు ప్రాతినిథ్యం వహించే పలువురు ధర్మాచార్యులు ఇందులో పాల్గొన్నారు.
హిందూ సమాజాన్ని , హిందూ మతాన్ని , హిందూ మత వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసే విధంగా మరీ ముఖ్యంగా  పరిస్థితి విషమిస్తున్న తరుణంలో ఐక్య  కార్యాచరణకు కు పటిష్ఠ విశాల వేదికను రూపొందించేందుకు ఉద్దేశించిన సమాలోచనలు జరిపారు. త్వరలో తిరుపతిలో విస్తృత స్థాయిలో  సాధుసంతుల సభ జరపాలని నిర్ణయించారు. 
 
ఈ సదస్సులో పాల్గొన్నవారిలో కంచి కామకోటి జగద్గురువు శంకర పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి మహా స్వామి,  శృంగేరి జగద్గురు పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి ప్రతినిథిగా శృంగేరి శారదా పీఠం ఎడ్మినిస్ట్రేటర్ శ్రీ  గౌరీశంకర్, పెజావర్ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ  విశ్వ ప్రసన్న తీర్థ మహాస్వామి, హంపి విద్యారణ్య మహా సంస్థాన పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి, పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి, తుని సచ్చిదానంద తపోవన పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి, అహోబిల మఠాధీశ్వరులు శ్రీమతే శ్రీవన్ శఠకోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదశికన్ మహాస్వామి వారి ప్రతినిథి, శ్రీ భువనేశ్వరీ మహాపీఠ ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి మహాస్వామి, శ్రీ ముముక్షుజన మహా పీఠాధిపతి ముత్తీవి సీతారాం గురువర్యులు తదితరులు ఉన్నారు.
 ఏపీలో మైనారిటీల మెప్పు కోసం హిందూ దేవాలయాల సొమ్ము విచ్చలవిడిగా  దుర్వినియోగం అవుతున్నది.  హిందూ దేవస్థానాల పరిపాలనలో హైందవేతరుల, హిందూ మత వ్యతిరేకుల పెత్తనం పెరిగింది. అనుచిత ప్రలోభాలతో, ఒత్తిళ్ళతో అక్రమ మతాంతరీకరణలు ముమ్మరమయ్యాయి. మతమార్పిడులు రాష్ట్రమంతటా బాహాటంగా చట్ట విరుద్ధంగా సాగుతున్నాయి. ఎందరు ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికార యంత్రాంగం లక్ష్య పెట్టటంలేదని సదస్సు ఆగ్రవేశాలు వ్యక్తం చేసింది.     
 

ఆరు గంటలకు పైగా సాగిన ఈ ఆత్మీయ సమాలోచనలో అనేక ధార్మిక విషయాలపై చర్చ జరిగింది. ప్రత్యేకంగా దక్షిణాదిన కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్,కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాలలో సనాతన ధర్మం, హిందూ సంస్కృతి, హిందువుల విశ్వాసాలమీద  వివిధ దిశలలో జరుగుతున్న దాడులపై సదస్సు ఆవేదనను వ్యక్తం చేసింది. 

ఆంధ్ర ప్రదేశ్ లో పూర్వపు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణ పుష్కరాల సందర్భంగా దేవాలయాలను తొలగించిన తీరును రాష్ట్ర ప్రజలు మరచి పోక ముందే దారుణాలు జరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. 

అయోధ్యలోని రామజన్మభూమిలో  ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడికి దివ్యమైన గుడి కట్టేందుకు మొత్తం హిందూ సమాజం దీక్షాబద్ధమైన సమయాన రాముడు నడయాడిన పుణ్యభూమిలో రాములవారి విగ్రహానికి శిరశ్ఛేదం చేసే దారుణానికి తెగబడటం..సహించరాని,  క్షమించరాని దురాగతం అని స్పష్టం చేశారు. అటువంటి దుష్కృత్యాలకు పాల్పడిన దుండగులను రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా దండించాలని డిమాండ్ చేశారు.

 దేవాలయ ప్రాంగణాలలో అన్య మత ప్రచారాలు

ఆంధ్రప్రదేశ్ లో నిబంధనలకు విరుద్ధంగా హిందూ దేవస్థానాల పరిసరాలలో , దేవాలయ ప్రాంగణాలలో అన్య మత ప్రచారాలు, అన్యమత చిహ్నాల ప్రదర్శనలు నిరాఘాటంగా సాగుతున్నాయి.  తిరుమల, శ్రీశైలం , సింహాచలం  వంటి పవిత్ర పుణ్య క్షేత్రాలలో అన్య మతస్తుల ఆగడాలకు అంతు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవలి నెలల్లో హైందవ దేవాలయ వ్యవస్థపై, దేవతా మూర్తులపై, హైందవ మత విశ్వాసాలపై , హిందువుల సెంటిమెంట్లపై జరిగిన దుర్మార్గపు దాడులకు, విధ్వంసాలకు, తీరని అపచారాలకు బాధ్యులైన కర్తలను, కారకులను, వారిని ప్రేరేపించిన వారిని వెంటనే గుర్తించి, శిక్షించేందుకు  ప్రభుత్వం సత్వరం కదలాలని పిలుపిస్తూ అది పాలకులకే క్షేమం  అని ధచార్యులు ప్రభుత్వానికి కర్తవ్య బోధ చేశారు. 

దేవాలయాల నిధులను ధార్మిక ఇతర కార్యక్రమాలకు మల్లించరాదని స్పష్టం చేశారు.      దేవాలయాల నిథులలో ఒక్క పైసా కూడా హిందూ ధర్మంతో సంబంధం లేని సెక్యులర్, అవసరాలకు, సంక్షేమ పథకాలకు  మళ్ళించకూడదని, ఆయా దేవాలయాల అభివృద్ధికీ ధర్మ ప్రచారానికీ మాత్రమే ఆలయ నిధులు వెచ్చించాలని ప్రభుత్వానికి హిత బోధ చేశారు. 

దేవాలయవ్యవస్థ పై ప్రభుత్వ నియంత్రణ ,  దేవదాయ ధర్మదాయ శాఖ పనితీరు. దేవుడి అస్తుల, ఆభరణాల భద్రత, అర్చకుల సంక్షేమం, భక్తుల సౌకర్యాలు  వంటి అనేక అంశాలకు సంబంధించి ఉత్పన్నమైన వివాదాలను , అభియోగాలను , విజ్ణుల సూచనలను సాకల్యంగా అధ్యయనం చేసి పరిస్థితిని చక్కదిద్దే మార్గాన్ని సూచించేందుకు రిటైర్డ్ న్యాయముర్తి ఆధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీని  నియమించాలి. పీఠాధిపతులు, విజ్ణుల సలహాలతో వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఆ కమిటీలో సభ్యులుగా నియమించాలని సదస్సు డిమాండ్ చేసింది.

దేవాలయ కేంద్రంగా భక్త సంఘాలు

దేవాలయ ఆస్తుల , సంప్రదాయాల , ఆచారాల  పరిరక్షణ నిమిత్తం దేవాలయాలలో   భక్త సంఘాలు ఏర్పడాలని,  ఆర్కిలాజికల్ పరిధిలోని ప్రాచీన దేవాలయాల్లో పూజలకు అనుమతులని సదస్సు పిలుపిచ్చింది. అలాగే -దేశ వ్యాప్తంగా  అనేక ప్రాచీన దేవాలయాల్లో ఆర్క్యలాజికల్ విభాగపు ఏకపక్ష ధోరణి వల్ల ఆ దేవాలయాల్లో దీప, ధూప నైవేద్యాలు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేసింది. 

అధికారులు ధర్మాచార్యుల తో సంప్రదింపులు జరిపి గర్భ గృహంలో పూజలు హరుగునట్లు, ఆయా దేవాలయాల ప్రాచీనతను కాపాడడంలో ఆర్కియలాజికల్ వారి నియమాలను పాటించే విధంగా ఒక సమన్వయ మార్గాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ రూపొందించాలని ధర్మాచార్యులు సూచించారు. 

అన్ని వైపులా దాడులతో సంక్షుభితమైన  హిందూ సమాజానికి  ఎలాంటి సందేశం ఇవ్వాలి ?  ఏ విధమైన దిశా నిర్దేశం చేయాలి ? సనాతన ధర్మరక్షణకు, హైందవ మత పరిరక్షణకు ఎటువంటి కార్యాచరణ నిర్దేశించాలి? అందులో అన్ని మత శాఖలకు, సంప్రదాయాలకు చెందిన ధర్మాచార్యులను , ఆధ్యాత్మిక వేత్తలను, ధార్మిక ప్రముఖులను  , ధార్మిక, మత సంస్థలను ఎలా నిమగ్నం చేయాలి? సనాతన ధర్మ సంరక్షణకు , దుష్ట శిక్షణకు ఏ విధంముందుకుసాగించాలి అన్న  అంశాలపై ఈ సదస్సులో లోతైన చర్చ జరిగింది.

ఇటువంటి అతిముఖ్య అంశాలపై సమగ్ర సమాలోచన జరిపేందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో  వీలైనంత త్వరగా విస్తృత సమావేశాలు నిర్వహించాలని  సదస్సు నిర్ణయించింది. ఈ క్రమంలో మొదటి అడుగుగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని సంప్రదాయాలకు, వివిధ హైందవ మత శాఖలకు చెందిన సాధు సంతుల, పీఠాధిపతుల మహాసభను  త్వరలో  తిరుపతి లో  జరపాలని  ధర్మాచార్యులు నిర్ణయించారు.

ప్రభుత్వాన్ని నడిపేవారు రాజ ధర్మాన్ని విస్మరించినప్పుడు ధర్మ సంరక్షణకు ప్రజలే ఆయత్తం కావాలి. సనాతన ధర్మాన్ని , హిందూ మతాన్ని కాపాడుకోవటానికి నిరంతరం జాగరూకత చూపాలి. హిందువులందరూ దీర్ఘ కాలిక ధర్మ పోరాటానికి సమైక్యంగా కదలాలని సదస్సు పైపులుపిచింది  ఈ దిశగా హిందూ సమాజాన్ని జాగృత పరచటానికి ధర్మాచార్యులు సంయుక్త పర్యటనలు జరపదలిచారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటిస్తారు.