బడ్జెట్‌లో భారీ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం!

ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విధానానికి కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో వెల్లడించే అవకాశం ఉందని తెలిసింది. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భారీ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. 

ఇందులో నాలుగు కంపెనీల ప్రైవేటీకరణ, ఒక మెగా ఐపీవో ఉండవచ్చని తెలుస్తోంది. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌-వైజాగ్‌ స్టీల్‌) వ్యూహాత్మక విక్రయానికి సంబంధించిన అంశాన్ని కూడా కేబినెట్‌ పరిశీలించినట్టు తెలుస్తోంది. ఈ వివరాలు కూడా వెల్లడికావాల్సి ఉంది. ఎల్‌ఐసీ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ ఉంటుందని భావిస్తున్నారు. 

 గత బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ రూ.2.1 లక్షల కోట్ల భారీ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ప్రకటించారు. అయితే, కొవిడ్‌ వల్ల పరిస్థితులు మారిపోయాయి. భారత్‌ పెట్రోలియం, కంటైనర్‌ కార్పొరేషన్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ల ప్రైవేటీకరణకు 2019 నవంబరులో కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎయిర్‌ ఇండియాతోపాటు ఈ కంపెనీల ప్రైవేటీకరణ ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి కానుంది.