కాశ్మీర్ లో నగల  వ్యాపారిపై ఉగ్రవాదుల వేటు 

కాశ్మీర్ లో నగల  వ్యాపారిపై ఉగ్రవాదుల వేటు 

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. ఇటీవల స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందిన ఓ స్థానికేతరుడిని దారుణంగా హత్యచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్‌పాల్‌ నిశ్చల్‌ (70) అనే నగల వ్యాపారి కశ్మీర్‌లో 50 ఏళ్లుగా నివాసముంటున్నారు. ఆయన శ్రీనగర్‌లోని ఓ మార్కెట్‌కు వెళ్లిన ఆయనపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

 గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెసిస్టంట్‌ ఫ్రంట్‌ అనే ఉగ్రమూఠా ఈ దారుణానికి పాల్పడ్డట్లు ప్రకటించుకుంది. కేవలం స్థానికేతరులను బెదిరించాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 15 ఏళ్ళ పాటు స్థానికంగా నివాసమున్న వారికి స్థానికులనే సర్టిఫికెట్ జారీ చేయడం ప్రారంభించారు. 

 స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందే ఎవరినైనా ఆక్రమణదారులుగానే భావిస్తామని ఉగ్రముఠా చెప్పుకొచ్చింది. అధికరణ 370 రద్దు తర్వాత జమ్మూ – కశ్మీర్‌ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. 

దీంతో అక్కడి స్థిరాస్తులను స్థానికేతరులు సైతం కొనుగోలు చేసేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు 10 లక్షల మంది స్థానికేతరులు స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందినట్లు గుణాంకం చెబుతున్నాయి. ఆ విధంగా ధ్రువీకరణ పత్రం పొందిన వారిలో బహుశా మొదటగా ఇతనినే ఉగ్రవాదులు కాల్చి చంపారు. 

 వీరిలో చాలామంది అనేక సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్లి నివాసముంటున్నవారే. అయితే, వీరిలో స్థానికేతరులు ఎవరన్నది మాత్రం ప్రభుత్వం వెల్లడించడం లేదు.