గ్రామ సర్పంచ్ గా పాకిస్తాన్ మహిళ!

పాకిస్థాన్‌కు చెందిన ఒక మహిళ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. స్థానికులు దీనిపై ఫిర్యాదు చేయడంతో కంగుతిన్న  అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కిస్థాన్‌లోని కరాచీకి చెందిన బానో బేగం (65) సుమారు 40 ఏండ్ల కిందట భారత్‌కు వచ్చారు. ఉత్తరప్రదేశ్‌ ఎటా గ్రామంలోని తన బంధువుల వద్దకు వచ్చిన ఆమెకు స్థానిక వ్యక్తి అక్తర్ అలీతో పెండ్లి అయ్యింది.

పాక్‌ పౌరసత్వం, సుదీర్ఘ కాలం పాసుపోర్టు కలిగిన బానో బేగం నాటి నుంచి ఇక్కడే స్థిరపడ్డారు. భారత పౌరసత్వం కోసం పలుసార్లు దరఖాస్తు చేశారు. మరోవైపు ఆధార్‌ కార్డుతోపాటు పలు ధ్రువీకరణ పత్రాలను పొందిన బానో బేగం 2015లో గ్వాడౌ గ్రామ వార్డు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 

2020 జనవరి 9న గ్రామ సర్పంచ్‌ షెహ్నాజ్ బేగం మరణించారు. అనంతరం గ్రామ కమిటీ బానో బేగంను తాత్కాలిక సర్పంచ్‌గా ఎన్నుకున్నది. ఈ విషయం తెలిసిన కొందరు స్థానికులు బానో బేగంకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. 

అధికారులు విచారణ జరుపగా ఆమె పాకిస్థాన్‌ జాతీయురాలని తెలిసింది. దీంతో బానో బేగం సర్పంచ్‌ అయ్యేందుకు సహకరించిన వారితోపాటు ఆధార్‌కార్డు వంటి ధ్రువీకరణ పత్రాలను ఆమె ఎలా పొందారన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.