దేవుడు శాసించాడు.. రజినీ రాజకీయాలకు దూరం 

వచ్చే నెల రాజకీయ పార్టీ ప్రారంభించి, త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అన్ని సీట్లలో పోటీ చేస్తానని చెబుతూ తన రాజకీయ పార్టీ పేరు, ఇతర వివరాలు ఈ నెల 31న వెల్లడిస్తానని ప్రకటించిన తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాలకు దూరంగా జరుగుతున్నట్లు రెండు రోజుల ముందే వెల్లడించారు. 
తాను రాజకీయ పార్టీని ప్రారంభించడం లేదని  రజినీకాంత్ సంచనల ప్రకటన చేశారు. తనకు దేవుడు హెచ్చరిక చేశాడని, అందుకే రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే ఆలోచనను విరమించుకుంటున్నానని రజినీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం మూడు పేజీల సుదీర్ఘ లేఖను సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఈ లేఖలో రజనీ ఏమని చెప్పారంటే.. ‘‘అనారోగ్య కారణాల వల్లే నేను రాజకీయాలకు దూరం అవుతున్నాను. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంటున్నందుకు అందరూ క్షమించండి. రాజకీయ ప్రకటనకు ముందు నేను అనారోగ్యానికి గురవడం, ఆసుపత్రిలో చేరడం.. ఇవన్నీ దేవుడి హెచ్చరికగా భావిస్తున్నాను. అందుకే రాజకీయాల్లో అడుగుపెట్టకూడదని నిర్ణయించుకున్నాను” అంటూ ప్రకటించారు.
పైగా,   ప్రసార మాధ్యమాల ద్వారానో, సోషల్ మీడియా ద్వారానో ప్రచారం చేసి రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావడం సాధ్యం కాదు. లక్షలాది మంది ప్రజల్ని నేరుగా కలిసి వారితో చర్చిస్తేనే రాజకాయాల్లో సమూల మార్పు సాధ్యపడుతుంది. ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితుల్లో అది అసంభవం అని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అదీగాక,  కరోనా కొత్త రూపాన్నీ సంతరించుకుంటోంది. ఈ పరిణామాలన్నింటికీ గమనించే  తాను రాజకీయాలకు దూరం అవుతున్నాను అంటూ రజినీకాంత్ తన లేఖలో పేర్కొన్నారు.  తీవ్రమైన రక్తపోటు, అలసట కారణంగా రజనీ డిసెంబరు 25న ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.
హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో రెండు రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయి చెన్నై వెళ్లిపోయారు. దీంతో కొద్ది రోజుల విశ్రాంతి తీసుకుని మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని అభిమానులంతా అనుకున్నారు. అయితే ఊహించని విధంగా వారందరిని నిరుత్సాహ పరుస్తూ రజినీకాంత్ తాను రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు.
 
కాగా,  రజినీ ప్రకటన వెనక ఆయన కుమార్తెలు ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయాలు వద్దని … , అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు చెన్నైలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన అనారోగ్యానికి గురికావడంతో కూతుళ్లు సౌందర్య, ఐశ్వర్య తీవ్రంగా తల్లడిల్లారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి వద్దని రజినీని కోరారట. నిత్యం అవే ఆలోచనలతో ఉంటున్న కారణంగా… మానసికంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని తెలిపారట.