వ్యవసాయ చట్టాలకు మద్దతుగా దేశ ప్రజలు 

 

నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు, రైతు సంఘాలు ఉధృతంగా  ఆందోళనలు  చేస్తుంటే,  దేశంలోని ప్రజాభిప్రాయం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. దేశంలోని అత్యధికులు కేంద్ర వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇస్తున్నారు.  అంతేకాకుండా రైతులు వెంటనే తమ ఆందోళనను విరమించాలని సూచిస్తున్నారు. 

రైతు ఉద్యమం, నూతన చట్టాలపై ప్రతిపక్షాలు చేస్తోన్న ఆందోళనల నేపథ్యంలో ఓ జాతీయ ఛానెల్ నూతన వ్యవసాయ  చట్టాలపై దేశవ్యాప్త సర్వే నిర్వహించింది.  ఈ సర్వే 22 రాష్ట్రాల్లో నిర్వహించగా  2,400 మంది స్పందించారు. నూతన చట్టాలు రైతులకు ఎంతో లాభదాయకమని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. 

అంతేకాకుండా తెలంగాణ, ఏపీ, యూపీ, మధ్యప్రదేశ్ ప్రజలు నూతన చట్టాలు ప్రజల కోసమే అని బలంగా విశ్వసిస్తున్నారని ఈ సర్వేలో తేలింది. వ్యవసాయ రంగంలో కాస్త సరళీకరణ జరిగిన పంజాబ్ మాత్రమే ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతోందని తెలిసింది. దేశంలో 53.6 శాతం మంది ప్రజలు నూతన వ్యవసాయ చట్టాలకు జై కొడుతున్నారని, 56.59 శాతం మంది రైతుల ప్రయోజనార్థమే కేంద్రం ఈ చట్టాలను తెచ్చిందని నమ్ముతున్నారు. 

వీటితో పాటు నూతన చట్టాల ద్వారా రైతులు మంచి ఆదాయాన్ని పెంచే అవకాశం ఉందని ప్రతి ఐదుగురిలో ముగ్గురు భావిస్తున్నారు. రైతు మండీలకు బయట కూడా రైతులు ధాన్యాన్ని అమ్ముకోవచ్చన్న నిర్ణయం మంచిదేనని, ఈ నిర్ణయానికి 73 మంది మద్దతు పలికారు. రైతు ఉద్యమం కేవలం రాజకీయ ప్రేరేపితంగానే జరుగుతోందని 48.7 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు.