కోవిడ్ టీకా ప్రారంభమైన వెంటనే సీఏఏ  

కోవిడ్ టీకా ప్రారంభమైన వెంటనే  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ను పరిశీలిస్తామని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా పౌరసత్వ చట్టానికి సంబంధించిన నిబంధనలు ఇంకా రూపొందించ బడలేదని ఆయన తెలిపారు. 

కోవిడ్-19 టీకాలు ప్రారంభించిన తర్వాత సీఏఏ పరిశీలనపై ఓ నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ పర్యటన సందర్భంగా చొరబాటు దారులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. 

బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని  స్పష్టం చేశారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఘోరంగా ఫెయిలయిందని ఆరోపించారు. టీఎంసీ నియంతృత్వ విధానాలపై  బీజేపీ పోరాటం చేస్తుందని ప్రకటించారు

ఇటీవల బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడిపై సీఎం మమతా మమతా బెనర్జీని ప్రశ్నించారు. నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడికి సంబంధించి అన్ని వివరాలనూ సేకరిస్తున్నామని, రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు. 

ఈఘటనపై తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ దాడి బీజేపీకే పరిమితం కాదని,ఇది పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బయటి వ్యక్తుల పేరుతో తృణమూల్ కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. 

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వినిపించే హక్కు ఉండాలని బీజేపీ విశ్వసిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. అన్ని పార్టీలు తమ గొంతు వినిపించేలా చూడటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు రాష్ట్రంలో నిబంధనలను పాటించాలని టీఎంసీని కోరారు. 

రైతుల సమస్యలు పరిష్కరించడంలో టీఎంసీ విఫలమయిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి  రాష్ట్ర ప్రభుత్వం సాయపడడం లేదని చెప్పారు. అయితే పీఎం-కిసాన్ సమ్మన్ నిధి పథకం రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు ఇస్తామని చెప్పారు. టీఎంసీ తన మేనల్లుడు గురించి మాత్రమే ఆందోళన చెందుతోందని అమిత్‌షా  పేర్కొన్నా‌రు.