తృణ‌మూల్‌కు మ‌రో ఐదుగురు రాజీనామా  

తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ త‌గిలింది. ఆ పార్టీ నాయ‌కుడు సువేంద‌రు అధికారి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో  టీఎంసీలోని అసంతృప్త నాయ‌కులు ఒక్కొక్కరు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. తాజాగా గోబింద‌పూర్ మ‌హేశ్‌పూర్‌, బామ‌న్‌గోలా, ప‌కువాహాట్, చందాపూర్ బ్లాక్‌ల అధ్య‌క్షులు తృణ‌మూల్ పార్టీకి రాజీనామా చేశారు. త‌మ రాజీనామా లేఖ‌ల‌ను  జిల్లా ప్రెసిడెంట్ మౌసం నూర్‌కు పంపారు. వీరంతా భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇలా ఉండగా, బుధవారం శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన  సువేంద‌రు అధికారి  ఒకరోజు తర్వాత టీఎంసీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. కాగా, త్వరలోనే ఈయన భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. మమత కేబినేట్‌లో మంత్రిగా పని చేసిన ఈయన కొంత కాలంగా పార్టీతో విభేదిస్తున్నారు.

తన రాజీనామా లేఖను టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి పంపించారు. ‘‘గౌరవనీయులైన మేడమ్.. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని స్థానాలకు రాజీనామా చేస్తున్నాను. పార్టీలో నాకు కల్పించిన అవకాశాలకు ధన్యవాదాలు. పార్టీలో నేను గడిపిన సమయాన్ని విలువైనదిగా భావిస్తాను’’ అని సువేందు రాసుకొచ్చారు. 

ఈ క్ర‌మంలోనే మ‌రికొంత మంది టీఎంసీని వీడే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి. మరోవైపు, వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు తృణమూల్‌కు 100 కూడా రావని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌ జోస్యం చెప్పారు. తృణమూల్‌లో నంబర్‌ 2 నాయకుడిగా వెలిగిన ఆయన 2017లోనే బీజేపీలో చేరారు. బెంగాల్‌లో కనీసం 200 సీట్లు గెలవాలని బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కోరుకుంటున్నారని కార్యకర్తల సమావేశంలో ఆయన చెప్పారు