దేశవ్యాప్తంగా అత్యుత్తమ పోలీస్స్టేషన్ల జాబితాను కేంద్ర హోంశాఖ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. అత్యుత్తమ 10 పోలీస్ స్టేషన్ ల జాబితాలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్స్టేషన్ నిలిచింది. తొలిస్థానంలో మణిపూర్కు చెందిన నాంగ్పోక్షికమై పోలీస్స్టేషన్ నిలువగా, పదో స్థానంలో జమ్మికుంట ఠాణా నిలిచింది.
దేశ వ్యాప్తంగా 16,671 పోలీస్స్టేషన్లకు వివిధ విభాగాల్లో స్టేషన్ల పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. 2015లో గుజరాత్ కచ్లో జరిగిన డీజీపీల సదస్సులో పోలీస్స్టేషన్ల పనితీరు గురించి ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.
డేటా విశ్లేషణ, పనితీరు పరిశీలన, ప్రజల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఆయా పోలీస్స్టేషన్లకు హోంశాఖ ర్యాంకులు ప్రకటిస్తోంది. తమిళనాడు సేలం జిల్లాలోని ఎడబ్ల్యుపిఎస్ సురమంగళమ్ పోలీస్స్టేషన్, అరుణాచల్ ప్రదేశ్లోని ఖర్సాంగ్ పోలీస్స్టేషన్లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
2020 కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ”ఎదురైన సవాళ్లు – పరిస్థితుల” ఆధారంగా ఉత్తమ పోలీస్స్టేషన్లను ఎంపిక చేశామని హోంశాఖ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని పోలీస్స్టేషన్ల నుండి ఈ జాబితాను ఎంపిక చేశామని తెలిపింది. ఆస్తులకు సంబంధించిన నేరాలు, మహిళలపై దాడులు, బలహీన వర్గాలపై దాడులు, తప్పిపోయిన వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తుల ఆచూకీ గుర్తింపు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తోంది.
దేశవ్యాప్తంగా ప్రకటించిన ర్యాంకుల్లో టాప్10లో జమ్మికుంట పోలీస్స్టేషన్ నిలువడంపై రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి సిబ్బందిని అభినందించారు. టాప్టెన్లో నిలిచినందుకు గర్వపడుతున్నట్లు ట్వీట్ చేశారు.
More Stories
తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీని గెలిపించాలి
కాళేశ్వరంపై కేసీఆర్ ను కూడా విచారిస్తాం
దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీ రావాలి