టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల   

టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల   
టీటీడీ ఆస్తులపై  టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి  శ్వేతపత్రం విడుదల చేశారు.   భక్తులు విరాళంగా ఇచ్చిన‌ ఆస్తులను అమ్మడానికి వీలు‌ లేకుండా శ్వేత పత్రం విడుదల చేశామని చెప్పారు. జాతీయ‌ ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లోనే టీటీడీ డిపాజిట్లు చేయాల‌ని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 
 
‘‘దేశవ్యాప్తంగా టీటీడీకి 1,128 ఆస్తులు ఉన్నాయి. టీటీడీకి 8,088 ఎకరాల స్థలాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆస్తులను ఏ విధంగా వినియోగంలోకి తేవాలన్న అంశంపై కమిటీ. త్వరలో ఈహెచ్‌ఎస్‌ స్కీంను అమలు చేస్తాం’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆస్తుల వివరాలను టిటిడి వెబ్ సైట్ లో ఉంచారు. 
 
తిరుమలలో పర్యావరణాన్ని కాపాడటంలో ప్లాస్టిక్‌ను నియంత్రించాం. తిరుమలను గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దుతాం. తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులు 100 నుండి 150 బస్సులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. తిరుమలలో గ్రీన్‌పవర్ వాడేందుకు పాలక మండలి సభ్యులు తీర్మానించారని పాలకమండలి సమావేశం అనంతరం వెల్లడించారు. 
 
 డిసెంబరు 27 నుంచి పది రోజుల‌పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలని నిర్ణయించామని చెప్పారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం పది రోజుల‌ పాటు తెరిచే ఉంచాలని భక్తులు కోరారని, ప్రత్యేక కమిటి ఏర్పాటు చేసి దేశంలో‌ని ప్రధాన పీఠాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పది రోజుల‌పాటు భక్తులకు స్వామి దర్శనం‌ కల్పిస్తామని ఆయన వెల్లడించారు.
 
తిరుమలలోని‌ ధ్వజస్తంభం, బలిపీఠం, మహాద్వారానికి బంగారు తాపడంపై చర్చించి‌ నిర్ణయం‌ తీసుకున్నాం. ప్రైవేట్ సెక్యూరిటీ వారికి యూనిఫాం అలవెన్స్ గా రెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. కాలు నడక భక్తుల‌ కోసం షెల్టర్ కూడా ఆధునీకరణ‌ పనులు చేపడుతున్నాం. గాలి గోపురాల మరమ్మత్తులకు నిధుల కేటాయించామని సుబ్బారెడ్డి వివరించారు. 
 
 తిరుచానూరు అమ్మవారి ఆలయంలో సూర్యప్రభ వాహనానికి 11.76 లక్షల బంగారు తాపడం కోసం ‌నిధులు కేటాయించాం. సాధారణ భక్తులకు కేటాయించే కాటేజీల ఆధునీకరణకు నిర్ణయం తీసుకున్నాం. ధర్మ రథాలు ధర్మ ప్రచార పరిషత్  కోసం తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 
 
టీటీడీ ఆధ్వర్యంలో పేదల  వివాహం కోసం కల్యాణ మండపాల్లో కల్యాణమస్తు కార్యక్రమం పున:ప్రారంభిస్తాం. బాల‌ మందిరాల్లో అనాధ పిల్లల సౌకర్యార్థం పది కోట్ల రూపాయలు నిధులు కేటాయించాం. చెన్నై వలందురు‌ పేటలో నాలుగు ఎకరాల్లో రూ.10 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నాని సుబ్బారెడ్డి తెలిపారు.