నావికాదళంలో చేరిన భారీ క్షిపణీ ‘వరుణస్త్ర’

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యంత భారీ క్షిపణీ ‘వరుణస్త్ర’ ఆదివారం భారత నావికాదళంలో చేరింది. ఎన్‌ఎస్‌టిఎల్‌లో డిజైన్‌ చేసి, మన ప్రభుత్వ రంగ సంస్థ బిడిఎల్‌లో ఈ క్షిపణి తయారైంది. 

ఈ మేరకు బిడిఎల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి డిఆర్‌డిఒ చైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుణాస్త్ర సముద్ర పోరాటంలో అండర్‌ వాటర్‌ ఫైటర్‌గానూ, వాటర్‌ నుంచి గాలిలోకి ఫైర్‌ ఫైటర్‌గానూ పని చేస్తుందని తెలిపారు. 

వరుణాస్త్రను తీర్చి దిద్దిన బిడిఎల్‌, ఎన్‌ఎస్‌టిఎల్‌ ఉద్యోగులను, సైంటిస్టులను డిఆర్‌డిఒ చైర్మన్‌ అభినందించారు. అడ్వాన్స్‌డ్‌ లైట్‌ వెయిట్‌ టార్పెడో (ఏఎల్‌డబ్ల్యూటీ), ఈహెచ్‌డబ్ల్యూటీ తయారీలో బీడీఎల్‌ శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారని తెలిపారు.

యుద్ధ నౌక నుంచే ఈ హెవీ వెయిట్‌ టార్పెడోను సముద్రంలో దాగి ఉన్న శత్రు దేశపు జలాంతర్గావిుపై ప్రయోగించవచ్చు. 95 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ప్రపంచంలో జీపీఎస్‌ ఆధారంగా దూసుకుపోయే ఏకైక టార్పెడోగా వారుణాస్త్ర వినుతికెక్కింది.   

కార్యక్రమంలో బిడిఎల్‌ వైస్‌ అడ్మిరల్‌, షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కె.శ్రీనివాస్‌, డైరెక్టర్‌ జనరల్‌ నేవల్‌ సిస్టమ్స్‌ అండ్‌ మెటీరియల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సమీర్‌ వి.కామత్ పాల్గొన్నారు.