26/11 సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పదేళ్లు జైలు 

ముంబయి పేలుళ్ల కుట్ర ప్రధాన సూత్ర ధారి, కరుడుగట్టిన తీవ్రవాది హఫీజ్‌ సయీద్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉగ్ర దాడులకు సంబంధించిన రెండు కేసుల్లో పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం హాఫీజ్‌కు ఈ శిక్ష విధించింది. 
 
జమాత్‌ ఉల్‌ దవా సంస్థ చీఫ్‌గా వ్యవహరిస్తున్న హఫీజ్‌కు ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చుతున్నారన్న కేసులో ఇప్పటికే 11 ఏళ్లు జైలు శిక్షపడింది. ప్రస్తుతం లాహోర్‌లోని ఓ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా హఫీజ్‌తో పాటు మరో నలుగురికి పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.
 
ఉగ్ర సంస్థలకు నిధులు అందిస్తున్నారన్న ఆరోపణలపై అతడితో పాటు జమాత్‌ ఉల్‌ దవా సభ్యులపై పాక్‌ ఉగ్ర నిరోధక సంస్థ దాదాపు 41 కేసులు పెట్టగా, వాటిల్లో రెండు కేసుల్లో గురువారం శిక్ష పడింది. 
 
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు ముందుండి అన్నీ చూసుకునే సయూద్‌…ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలోనూ ఉన్నాడు. అంతేకాకుండా అమెరికా అతడి తలపై 10 మిలియన్‌ డాలర్ల పారితోషికం ప్రకటించింది. 
ముంబయి పేలుళ్ల ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది క్షతగాత్రులైన సంగతి విదితమే.