లవ్ జీహాద్‌ కుట్రలో పాక్, ఐఎస్ఐ ఏజెంట్లు

లవ్ జీహాద్‌ కుట్రలో పాక్, ఐఎస్ఐ ఏజెంట్లు
లవ్ జీహాద్‌లో పాకిస్థాన్, ఐఎస్ఐ ఏజెంట్ల ప్రమేయం ఉందని మధ్యప్రదేశ్ శాసన సభ ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీతను రుబియాగా మార్చడానికి కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా కఠిన చట్టాన్ని తీసుకొస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు.

లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా కఠిన చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుందని చెప్పారు. లవ్ జీహాద్‌కు పాల్పడినవారికి పదేళ్ళ జైలు శిక్ష విధించే విధంగా నిబంధనలు ఉండాలని తాను చెప్పానని పేర్కొన్నారు. లవ్ జీహాద్‌లో పాకిస్థాన్, ఐఎస్ఐ ఏజెంట్ల ప్రమేయం ఉందని, సీతను రుబియాగా మార్చడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 

సీత రుబియాగా మారడాన్ని మనం ఎన్నాళ్ళు చూస్తూ కూర్చోవాలని రామేశ్వర్ శర్మ ప్రశ్నించారు. సీతమ్మలు మరణించడాన్ని మనం ఎంత కాలం చూస్తూ కూర్చోవాలని నిలదీశారు. మహిళలను భారత దేశం, మధ్యప్రదేశ్ గౌరవించాలని ఆయన సూచించారు.  

నర్గీస్, సునీల్ దత్ వంటి నిజమైన ప్రేమను చూపాలని అడిగారు. ఎందరు నర్గీస్‌లు సునీల్ దత్‌ను పెళ్లాడారో చెప్పాలని ప్రశ్నించారు. కాబట్టి ఇప్పుడు కఠినమైన చట్టం వస్తుందని, దాంతో నేరస్థులు భయంతో కాలం గడుపుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఇదిలావుండగా, మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మంగళవారం మాట్లాడుతూ, లవ్ జీహాద్‌ను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ బిల్లును వచ్చే శాసన సభ సమావేశాల్లో ప్రవేశపెడుతుందని చెప్పారు. 

యువతులను ఆకర్షించి, పెళ్లి చేసుకుని, ఆ తర్వాత మతం మారాలని హింసించే వ్యక్తులకు, బలవంతపు మతమార్పిడులకు పాల్పడేవారికి ఐదేళ్ళ వరకు జైలు శిక్ష విధించేందుకు తగిన నిబంధనలను ఈ బిల్లులో ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఈ నేరాన్ని కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించే నిబంధనలను ప్రతిపాదిస్తామని పేర్కొన్నారు.