వ్యాక్సిన్‌ కోసం 2022 వరకు వేచి చూడాలా!

కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ వచ్చే ఏడు ప్రథమార్ధంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నా సాధారణ ప్రజలు అందరికి అంది అందుబాటులోకి రావాలంటే 2022 వరకు వేచి చూడవలసిందే అని నిపుణులు చెబుతున్నారు. 

వ్యాక్సిన్‌ వచ్చినంత మాత్రాన కరోనా వైరస్‌ అంతరించిపోదని కరోనా వైరస్‌పై జాతీయ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)– ఢిల్లీ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా స్పష్టం చేశారు.  వ్యాక్సిన్‌ భారత మార్కెట్లలో సులభంగా లభించడానికి ఆ తర్వాత ఏడాదికిపైగా పడుతుందని చెప్పారు.

వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత జనాభాను దృష్టిలో ఉంచుకొని దాన్ని దేశంలోని ప్రతిమూలకూ పంపిణీ చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. జనాభా ఎక్కువ ఉన్న మన దేశంలో అది పెద్ద సాగాలి కాగలదని చెప్పారు. 

 వ్యాక్సిన్‌ పంపిణీకి అవసరమైన శీతల పరిస్థితులు కల్పిస్తూ తగిన సంఖ్యలో సిరంజిలు, సూదులు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. 

కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత దాని కంటే సమర్ధవంతంగా పనిచేసే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే ఏ వ్యాక్సిన్‌ వినియోగించాలన్న దానిపై కూడా  విసృతమైన చర్చ జరగాలని ఆయన సూచించారు.