సెల్ఫ్ ఐసోలేషన్ లోకి డబ్ల్యుహెచ్ఒ డిజి

ప‌్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యుహెచ్ఒ) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అథ‌నామ్ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి  వెళ్లారు. కరోనా బాధిత వ్యక్తితో సంబంధాలు ఉండడంతో సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు  టెడ్రోస్ తెలిపారు. కరోనా బాధిత వ్యక్తిని తాను కలిసినట్టు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. 
 
తనకు ఎటువంటి కరోనా లక్షణాలు లేవని ఆయన చెప్పారు. డబ్ల్యుహెచ్ఒ మార్గదర్శకాలకు అనుసరించి తాను సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు, ఇంటి నుంచే పని చేస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. కరోనా కట్టడికి వైరస్ మార్గదర్శకాలను విధిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. 
 
కరోనా బాధితులు విధిగా డబ్ల్యుహెచ్ఒ మార్గదర్శకాలను పాటించాలని, తోటి వారికి కరోనా రాకుండా చూడాలని, ఈ క్రమంలోనే డబ్ల్యుహెచ్ఒలో పని చేస్తున్న తన సహచరులకు హాని జరగకుండా తాను సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు ఆయన స్పష్టం చేశారు.