బీజేపీ కార్యకర్తలపై కాల్పులు జరిపితే రాష్ట్రపతి పాలన!

బీజేపీ కార్యకర్తలపై కాల్పులు జరిపితే అది రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించిన హింసే అవుతుందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ స్పష్టం చేశారు. కాల్పులు, లాఠీఛార్జి.. అంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు బీజేపీని బెదిరించడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే జరిగితే రాష్ట్రపతి పాలన ఒకటి ఉంటుందని గుర్తుంచుకోవాలని కేటీఆర్‌ను హెచ్చరించారు. 

పార్లమెంటు ఎన్నికల్లో ఆడుతూపాడుతూ కవితను ఓడించిన  తాము.. దుబ్బాక ఎన్నిక కోసం లాఠీఛార్జీ చేయించుకోవడం, కార్యకర్తల రక్తం చిందించుకునే స్థాయికి దిగజారుతామా? అంటూ ప్రశ్నించారు.

సిద్దిపేటలో సంజయ్‌ అరెస్టు అప్రజాస్వామికమని తేలింది. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం రాత్రికి రాత్రి ప్రత్యేక అధికారిని నియమించిన సంగతి మరచిపోవద్దని గుర్తు చేశారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా శాంతి భద్రతలపై మీకేం సంబంధం? హోంమంత్రి ఏమయ్యారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు .

టీఆర్‌ఎ్‌సకు దుబ్బాకలో ఓడిపోతామన్న భయం పట్టుకున్నందుకే కేటీఆర్‌ అక్కడకు వెళ్లలేదని అరవింద్ ఎద్దేవా చేశారు.

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో ప్రచారం చేసిన కేటీఆర్‌, దుబ్బాకకు ఎందు కు పోలేదు? బీజేపీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ ఇటీవలే కేటీఆర్‌ పార్టీ నేతలకు సూచించారు. మరిప్పుడు సీఎం, హరీశ్‌, కేటీఆర్‌ ఎందుకు బీజేపీ జపం చేస్తున్నారు? అని అర్వింద్‌ ప్రశ్నించారు. 

ఇలా ఉండగా, రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన నిధులు, చేసిన ఖర్చుపై సీఎం కేసీఆర్‌ శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రమే మొత్తం పింఛన్లు ఇస్తోందని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమంటూ కేసీఆర్‌ చేసిన సవాల్‌.. కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లుగా ఉందని ధ్వజమెత్తారు.

దుబ్బాకలో ఓటమి అపవాదును తప్పించుకునేందుకే సీఎం కేసీఆర్‌.. ధరణి, రైతు వేదికల పేరిట అధికారిక కార్యక్రమాలను ఎన్నికల ప్రచార సభలుగా చేస్తున్నారని విమర్శించారు.  

మరోవంక,  మంత్రి హరీశ్‌రావు తమ పార్టీ నాయకులను బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని విమర్శించారు.