బెంగాల్ లో బిజెపి నేత కాల్చివేత 

పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ముఖ్య అనుచరుడు, టిటాగర్ మునిసిపాలిటీ కౌన్సిలర్ మనీష్ శుక్లా దారుణ హత్యకు గురయ్యారు. పోలీస్ స్టేషన్ సమీపంలో దుండగులు అతి సమీపం నుంచి అతనిపై కాల్పులు జరిపి హతమార్చారు. ఈ హత్యకు నిరసనగా బీజేపీ మద్దతుదారులు పోలీస్ స్టేషన్ వెలుపల ఆందోళనకు దిగారు.  ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.   

పార్టీ నాయకులతో సమావేశం అనంతరం ఆదివారం రాత్రి కార్యకర్తలతో మాట్లాడుతుండగా ముసుగులు ధరించిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు శుక్లాపై అతి సమీపంనుంచి కాల్పులు జరిపారు. 

దీంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆయన కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలొదిలారు. శుక్లాతోపాటు మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి.

 దీంతో ఆగ్రహోదగ్రులైన  కార్యకర్తలు ఆందోళనకు దిగారు.  పరిస్థితి అదుపుతప్పడంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారి మనోజ్ వర్మ పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనపై బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. 

తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసీ) ఈ దాడికి పాల్పడిందని ఎంపీ అర్జున్ సింగ్ ఆరోపించారు. రాత్రి 7.30 వరకు తనతో ఉన్నారని, పోలీసుల సమక్షంలోనే శుక్లాపై కాల్పులు జరిగాయని విమర్శించారు. 

మరోవైపు గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీని వీరేంద్రను రాజ్ భవన్‌కు పిలిపించారు. మనీష్ తనకు తమ్ముడి లాంటి వాడని, బెంగాల్ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి టీఎంసీ, పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

 బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, పోలీసుల పాత్రను దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేరస్థులకు ఆశ్రయం కల్పిస్తోందని మరో సీనియర్ నాయకుడు అరవింద్ మీనన్ ఆరోపించారు. టీఎంసీ కుట్రలతో బహిరంగ  హత్యలకు తెగబడుతోందని  ట్వీట్ చేశారు. 2019 లో బీజేపీలో చేరిన మనీష్ శుక్లా ఎంపీ అర్జున్ సింగ్ ప్రధాన అనుచరుడు. శుక్లా  బీజేపీలో చేరడానికి ముందు టీఎంసీతో ఉన్నారు.