పాట్నాలో బిజెపి నేత కాల్చివేత   

అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్‌కు చెందిన ఒక బీజేపీ నేతను దుండగులు తుపాకీతో కాల్చి హత్య చేశారు. రాజధాని పాట్నాలో గురువారం ఈ ఘటన జరిగింది. స్థానిక నేత రాజేశ్ కుమార్ ఝా ఇటీవలే బీజేపీలో చేరారు.
గురువారం ఉదయం ఆయన తేజ్ ప్రతాప్ నగర్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో రాజేశ్ కుమార్ ఝా అక్కడికక్కడే మరణించారు. కొందరు వ్యక్తిగత కక్షతో ఆయనను లక్ష్యంగా చేసుకుని హత్య చేసినట్లు కనిపిస్తున్నదని కుటుంబ సభ్యుడు ఒకరు తెలిపారు.
మరోవైపు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. రాజేశ్‌కు తెలిసిన వ్యక్తులే ఆయనను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కాగా మరి కొన్ని రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా బీజేపీ నేత హత్య జరుగడం పాట్నాలో కలకలం రేపింది.