ఏసీపీ నర్సింహారెడ్డి ఆస్తులు రూ 100 కోట్లు!

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు విచారణను ఎదుర్కొంటున్న మల్కాజిగిరి ఏసీపీ వై.నర్సింహారెడ్డి సుమారు రూ 100 కోట్లకు పైగా ఆస్తు లు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అంచనాకు వచ్చారు. 

తెలంగాణ, ఏపీల్లోని 25 ప్రాంతాల్లో ఏసీబీ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడులు చేసి నరసింహారెడ్డి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించాయి.  బుధవారం ఉదయం సికింద్రాబాద్‌ మహేంద్ర హిల్స్‌లోని ఏసీపీ సరసింహరెడ్డి నివాసంలో హైదరాబాద్‌ రేంజ్‌ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి.

భారీగా బంగారు, వెండి ఆభరణాలు, కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఉప్పల్‌లో ఉన్న ఏసీపీ కార్యాలయంలో జరిగిన సోదాల్లో కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి ఏసీపీ నరసింహారెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

పలు భూవివాదాల్లో తలదూర్చేవాడన్న ఆరోపణలున్న ఏసీపీని చివరికి అవే వివాదాలు ఏసీబీకి పట్టించాయని సమాచారం. హైదరాబాద్‌లో బాగా పేరు ప్రఖ్యాతలు ఉన్న ఓ ప్రజాప్రతినిధి బినామీలతో ఏసీపీకి సంబంధా లు ఉన్నాయన్న ప్రచారం కలకలం రేపుతోంది.

కొండాపూర్‌లోని అసైన్డ్‌ భూమిని నరసింహారెడ్డి కొనుగోలు చేశాడని, ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు ఎదుట ఆయనే అంగీకరిం చారని సమాచారం. ఈ భూమిని మధుకర్‌ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులకు ఏసీపీ నరసింహారెడ్డి వెల్లడించారని తెలిసింది.

జగిత్యాల జిల్లా గంగాధరకు చెందిన ఎంపీపీ మధుకర్‌ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది.  ఏసీబీ అధికారులను చూసి మధుకర్‌ పారిపోయినట్లు తెలిసింది. అసలు ఈ వివాదమే.. వ్యవహారాన్ని ఏసీబీ వరకు తీసుకెళ్లినట్లు సమాచారం.

వీటితోపాటు ఘటకేసర్‌ సమీ పంలోని యమ్నంపేట్‌లో 30 ఎకరాల వివాదాస్పద భూమిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలూ ఉన్నాయి. నిజాం కాలం నాటి ఈ భూమిని రాజకీయ నేతలతో కలిసి కొన్నార ని ఏసీబీ వద్ద సమాచారం ఉంది. మధుకర్‌ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు.