శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో  శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. పంచెకట్టు, తిరునామంతో.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా వెళ్లి శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. 

ఈ సందర్భంగా వేదపండితులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం  శ్రీవారి గరుడ వాహన సేవలో పాల్గొని, ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్‌ను, డైరీని ఆయన ఆవిష్కరించిన సీఎం జగన్ శ్రీవారి దర్శనం అనంతరం శ్రీ పద్మావతి అతిధి గృహానికి చేరుకున్నారు. గురువారం ఉదయం 6.15 గంటలకు పద్మావతి అతిధి గృహం నుండి బయలుదేరి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు.

ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు నాద నీరాజనం సుందర కాండ పారాయణ  కార్య క్రమంలో పాల్గొంటారు. అలాగే కర్ణాటక రాష్ట్ర ఛారిటీస్ సత్రాలకు శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుమల నుండి 9.20 గంటలకు బయలుదేరి 10.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నవరం తిరుగు ప్రయాణం అవుతారు.