జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ దృష్టి 

వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై బీజేపీ దృష్టి సారిస్తున్నది. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టింది.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నగరం నుండి లోక్ సభకు  ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం, బండి సంజయ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన తర్వాత పార్టీ ఎదుర్కొంటున్న మొదటి కీలక ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలు పార్టీకి ప్రతిష్టాకరంగా మారాయి. 

రెండు నెలల నుండి ఈ ఎన్నికలపై  కిషన్ రెడ్డి ద్రుష్టి సారిస్తూ ప్రతి వారం నగర నేతలతో సమీక్షలు జరుపుతున్నారు.  ఇప్పుడు డివిజన్ల వారీగా పార్టీ కార్యకర్తలను సమావేశపరచి దిశా నిర్దేశం చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా అధికార టీఆర్ఎస్, ఆ పార్టీ మిత్రపక్షమైన మజ్లిస్ ల వ్యూహాలను దీటుగా ఎదుర్కొనేలా పార్టీ కేడర్ ను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. 

డివిజన్ల వారీగా ఉన్న సమస్యలను గుర్తించాలని, టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలో వారిపై చార్జీషీట్ తయారు చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీకి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఉండటంతో ఈ ఎన్నికలు వారికి సహితం కీలకం కానున్నాయి.

కరోనా కట్టడిలో టీఆర్ఎస్ విఫలం కావడంపై హైదరాబాద్ నగర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఇది బీజేపీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు. నగరంలో  డబుల్ బెడ్రూం ఇండ్లు, రోడ్ల నిర్మాణం వంటి ప్రధాన సమస్యలు కూడా పరిష్కారం కాకపోవడం, మున్సిపల్ మంత్రి గత గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ అమలు కాకపోవడంతో ప్రజలు టీఆర్ఎస్ పై వ్యతిరేకతతో ఉన్నారని బీజేపీ గుర్తించింతోది. 

మరోవంక కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో చిన్నాభిన్నమై ఉండడంతో పోటీ ప్రధానంగా టి ఆర్ ఎస్, బీజేపీల మధ్యనే ఉండే అవకాశం ఉంది.