ఢిల్లీ అల్లర్లపై 15,000 పేజీలతో చార్జిషీట్  

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన హింసపై ఢిల్లీ పోలీసులు బుధవారం 15,000 పేజీలతో కూడిన చార్జిషీట్‌ దాఖలు చేశారు. చార్జిషీట్‌లో 15 మంది పేర్లను పొందుపరిచారు. 
 
ఘర్షణలతో అట్టుడికిన ఢిల్లీలో 53 మంది మరణించారు. ఈ హింసాకాండపై కర్కదూమా కోర్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో 15 మంది నిందితుల పేర్లను చేర్చారు. 
 
 వీరిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) చట్టం, ఐపీసీ, ఆయుధ చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.మరోవైపు ఢిల్లీ ఘర్షణల కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో జేఎన్‌యూ నేత ఉమర్‌ ఖలీద్‌, సర్జీల్‌ ఇమాంల పేర్లను ప్రస్తావించలేదు. 
 
కాగా, కొద్దిరోజుల కిందట అరెస్ట్‌ అయిన ఉమర్‌, సర్జీల్‌ల పేర్లను అనుబంధ చార్జిషీట్‌లో చేర్చే అవకాశం ఉంది. ఢిల్లీలో చెలరేగిన సీఏఏ ఘర్షణలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.