సూక్ష్మ రుణ సంస్థలకు ఆర్బీఐ హెచ్చరిక  

కరోనా వైరస్‌.. సూక్ష్మ రుణ సంస్థ (ఎంఎఫ్‌ఐ)లకు ఆర్థిక సమస్యల్ని తెచ్చిపెట్టే వీలుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరించింది. మూలధన నిల్వల్ని పెంచుకోవాలని, నగదు నిర్వహణ కీలకమని తాజా నెలసరి బులిటెన్‌లో ప్రచురించిన ఓ కథనంలో ఆర్బీఐ సూచించింది. 

కొవిడ్‌-19తో ఎంఎఫ్‌ఐలకు కొత్త సవాళ్లు ఎదురుకావచ్చని, పెద్ద ఎత్తున ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చని ఆ కథనంలో ఆర్బీఐ పర్యవేక్షణ శాఖలోని స్నిమర్దీప్‌ సింగ్‌ తెలిపారు. అలాగే కరోనా సంక్షోభం ఇప్పట్లో తొలగిపోయేది కాదన్న ఆయన దీర్ఘకాలిక స్థితిస్థాపక నిర్మాణానికి ఇదో అవకాశమని చెప్పారు. కరోనా పరిస్థితులతో అన్ని రంగాలు, ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. 

ఈ పరిణామం అల్పాదాయ వర్గాలకు పూచీకత్తు లేని రుణాలిచ్చే సూక్ష్మ రుణ సంస్థలకు పెను నష్టమేనని స్పష్టం చేశారు. ఇచ్చిన రుణాలు వసూలు కావడం కష్టమేనని వ్యాఖ్యానించారు. అందుకే ఆర్థికపరమైన అంశాల్లో మునుపటి కంటే ఎంఎఫ్‌ఐలు బలంగా తయారు కావాల్సిన అవసరం ఉందని తెలిపారు.

కాగా, జూలైలోనూ ఆర్బీఐ డాలర్‌ నిల్వలను పెంచుకున్నది. మొత్తం 16.903 బిలియన్‌ డాలర్లను కొనగా, 930 మిలియన్‌ డాలర్లను తిరిగి అమ్మేసింది. దీంతో నికరంగా 15.973 బిలియన్‌ డాలర్లను కొనుగోలు చేసినైట్లెంది. ఈ మేరకు తాజా బులిటెన్‌లో ఆర్బీఐ వెల్లడించింది.

గతేడాది జూలైలో మాత్రం 1.592 బిలియన్‌ డాలర్లను కొనుగోలు చేసి, 1.685 బిలియన్‌ డాలర్లను అమ్మింది. ఇక ఈ ఏడాది జూన్‌ (9.814 బిలియన్‌ డాలర్లు), మే (4.363 బిలియన్‌ డాలర్లు) నెలల్లోనూ అమెరికా డాలర్లను ఆర్బీఐ కొన్న విషయం తెలిసిందే. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పుడు, దేశ ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు గురైనప్పుడు ఈ డాలర్‌ నిల్వలను ఆర్బీఐ వినియోగించి పరిస్థితులను చక్కదిద్దుతుంది.