భారత్ కు 24 చైనా మొబైల్ కంపెనీలు   

చైనా నుంచి నిష్క్రమిస్తున్న కంపెనీలను భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నట్టు కనిపిస్తున్నది. తాజాగా చైనాలోని 24 కంపెనీలు భారత్‌లో మొబైల్‌ ఫోన్‌ కర్మాగారాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి. 

ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీలో దిగ్గజాలుగా పేరుగాంచిన ఆపిల్‌, శాంసంగ్‌ లాంటి సంస్థల అసెంబ్లింగ్‌ భాగస్వాములు చైనా నుంచి భారత్‌కు తరలివచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. మొబైల్‌ ఫోన్‌ కర్మాగారాల ఏర్పాటు నిమిత్తం ఈ సంస్థలు భారత్‌లో 1.5 బిలియన్‌ డాలర్ల (రూ.11,217 కోట్ల)మేరకు పెట్టుబడు లు పెట్టేందుకు ముందుకు వచ్చినట్టు ‘బ్లూమ్‌బర్గ్‌’ వెల్లడించింది. 

కరోనా వైరస్‌ వ్యాప్తి, అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఈ కంపెనీలు తమ సైప్లె చైన్లను ఇతర దేశాలకు తరలించాలని యోచిస్తున్నాయి. భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించాలని ఆపిల్‌ భావిస్తున్నట్టు తాజా వార్తలు స్పష్టం చేస్తున్నాయి. 

అలాగే ఆపిల్‌కు వివిధ రకాల విడిభాగాలను సరఫరా చేయడంతోపాటు ఐఫోన్లను అసెంబ్లింగ్‌ చేస్తున్న ఫాక్స్‌కాన్‌ సంస్థ కూడా చెన్నైకి సమీపంలోని తమ ప్లాంట్‌లో రానున్న మూడేండ్లలో 1 బిలియన్‌ డాలర్ల (రూ.7,478 కోట్ల) పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నది. ఐఫోన్ల ఉత్పత్తిని చైనా నుంచి ఇతర దేశాలకు తరలించాలని ఆపిల్‌ ఇప్పటికే తమ భాగస్వాములకు గట్టిగా విజ్ఞప్తి చేసినట్టు రాయిటర్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది.

వాస్తవానికి చైనా నుంచి నిష్క్రమించే సంస్థలను ఆకర్షించడం లో వియత్నాం, కం బోడియా, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, థాయిలాండ్‌ లాంటి దేశాల కంటే మన దే శం చాలా వెనుకబడింది. అయినప్పటి కీ దేశంలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలను సృష్టించి 153 బిలియన్‌ డాలర్ల విలువైన సరుకులను తయారు చేసేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) దోహదం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది.
 
ఓవైపు దేశీయ సంస్థలను ప్రోత్సహించడం, మరోవైపు మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ విడిభాగాల తయారీ రంగంలోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా భారీ స్థాయిలో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను తయారు చేసేందుకు పీఎల్‌ఐ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు కేంద్రం మార్చిలో ప్రకటించింది. ఆ తర్వాత దీన్ని ఫార్మా, ఆటో, టెక్స్‌టైల్‌, ఫుడ్‌ప్రాసెసింగ్‌ లాంటి ఇతర రంగాలకూ విస్తరించింది.