ఎపెక్స్ కౌన్సిల్ కు ముఖం చాటేస్తున్న కేసీఆర్ 

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చొరవ తీసుకొని ఆగష్టు 5న ఎపెక్స్ మండలి సమావేశం ఏర్పాటు చేస్తే ఈ సమావేశంపై ముఖం చాటేయడం ద్వారా వివాదాల పరిష్కారం పట్ల తనకు ఆసక్తి లేదని సంకేతం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇచ్చిన్నట్లు అయింది. పైగా వివాదాలు పరిష్కరించడం లేదని కేంద్రాన్ని నిందించడం ఆయన ద్వంద ధోరణులను వెల్లడి చేస్తుంది. 

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలు తామిద్దరమే పరిష్కరించుకొంటామని, బైటవారి జోక్యం అవసరం లేదని అంటూ గత ఏడాది ఒకటికి మూడు సార్లు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు అధికారిక నివాసంలో గత ఏడాది సమావేశాలు జరిపి ప్రకటించారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సహితం సమాలోచనలు జరిపారు. 

అయితే  ఇప్పటి వరకు ఒక వివాదాన్ని కూడా పరిష్కరించుకొనే ప్రయత్నం వారిద్దరూ చేయనే లేదు. పైగా ఈ సమావేశాలను అర్ధాంతరంగా ముగించివేసి, ఆ తర్వాత ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం ప్రారంభించారు. కృష్ణ, గోదావరి నదుల యాజమాన్య బోర్డులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. పొరుగు రాష్ట్రం అక్రమంగా జలాలను ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపణలు చేసుకున్నారు. 

అంతేకాదు, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ముందుగా అనుమతి లేకుండా సాగునీటి పధకాలను చేపడుతున్నట్లు కూడా ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే ముందుగా 2014 తర్వాత చేబడుతున్న సాగునీటి పధకాలకు సంబంధించిన సవివర ప్రాజెక్ట్ రిపోర్ట్ లను ఇవ్వమని గోదావరి, కృష్ణ బోర్డులు రెండు రాష్ట్రాలను పలుసార్లు కోరినా, ఒక్క ప్రాజెక్ట్ కు  సంబంధించిన రిపోర్ట్ ను కూడా ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. 

ఈ విషయమై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఫిర్యాదు చేయడంతో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చొరవ తీసుకొని రెండు రాష్ట్రాల మధ్య గల జలవివాదాలు పరిష్కారం కోసం ఎపెక్స్ మండలి సమావేశం జరపాలని నిర్ణయించారు.  ఈ సమావేశానికి అజెండా అంశాలను సూచించామని కోరినా ఎవ్వరు పంపలేదు. దానితో కేంద్రమే నాలుగు అంశాలతో ఆగష్టు 5న సమావేశం జరపాలని ప్రతిపాదించింది. 

ఈ విషయమై గురువారం ఉన్నతాధికార సమావేశం జరిపిన కేసీఆర్ ఈ సమావేశంపై హాజరు కావడం పట్ల విముఖత వ్యక్తం చేశారు. సమావేశాన్ని వాయిదా వేయమని కోరారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ఆ తేదీని వాయిదావేయాలని, స్వాతంత్య్ర దినోత్సవం పూర్తయ్యాక ఆగస్టు 20 తరువాత సమావేశం ఉండేలా తేదీని నిర్ణయించాలని కోరుతూ కేంద్ర జలవనరులశాఖకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి సూచించారు. 

అంతటితో ఆగకుండా, జలవివాదాలు కొనసాగించడానికి కేంద్రందే బాధ్యత అన్నట్లు ఆరోపణలు చేశారు. ఈ వివాదాలను పరిష్కరించే బాధ్యతను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గాలికి వదిలివేసిన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ మోహన్ రెడ్డి కూడా తమ వివాదాలను చట్టబద్ధ సంస్థల ద్వారా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయడం లేదు. 

తమ ఇష్టం వచ్చిన్నట్లు చేసుకొంటూ, పరస్పరం ఆరోపణలు చేయూసుకొంటూ తమ తమ రాష్ట్రాలలోని ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ది పొందే కుటిల ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది.