అస్సాంలో వరదలు బీభత్సం.. 71 మంది మృతి 

అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక బ్రహ్మపుత్రా నది ప్రమాదకరస్థాయి దాటి ప్రవహిస్తోంది. ఫలితంగా ఊళ్లకు ఊళ్లు నీట మునిగాయి. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 71మంది మృతి చెందారు.

 వీరిలో 26 మంది కొండచరియలు విరిగి పడటంతో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 27 జిల్లాలపై వరదలు తీవ్ర ప్రభావం చూపాయాని అసోం స్టేట్ డిసాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది. అసోంలోని 122 రెవెన్యూ సర్కిళ్లు వరద ప్రభావానికి లోనయ్యాయి. 4766 గ్రామాలు నీటమునిగాయి. 40 లక్షల మంది నిర్వాసితులు అయ్యారు. 

ముంపు ప్రాంతాల్లో బాధితుల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఆవాసాలు కోల్పోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద బాధితుల కోసం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 445 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.   

మరోవంక, వరుస భూకంపాలు అసోం, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అసోం రాష్ట్రంలోని హైలాకుండీలో శనివారం తెల్లవారుజామున 4.25 గంటలకు భూకంపం వచ్చింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైందని శాస్త్రవేత్తలు చెప్పారు. 

శుక్రవారం రాత్రి మిజోరంలోని దక్షిణ చంఫాయ్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. జమ్మూకశ్మీర్ లోనూ ఇటీవల పలుసార్లు భూమి కంపించింది. వరుస భూప్రకంపనలతో ప్రజలు వణికిపోతున్నారు. భూమి కంపించినప్పుడల్లా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు.