చర్చలంటూనే బలగాలు మొహరిస్తున్న చైనా 

ఒక వైపు చర్చలు జరుపుతూ, శాంతి వచనాలు పలుకుతూ,  గల్వాన్‌ లోయలో భారత బలగాలు ధ్వంసంచేసిన చోటనే చైనా సైనికులు మళ్లీ టెంట్ల వంటి నిర్మాణాలు చేపట్టారు. ఈఘర్షణ జరిగిన పెట్రోల్‌పాయింట్‌ 14 వద్దనే చైనా మళ్లీ నిర్మాణాలు చేపట్టినట్టు శాటిలైట్‌ చిత్రాల్లో గుర్తించామని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.

ఎల్‌ఏసీ వెంట చైనా పదివేలకు మించి బలగాలను మోహరించిందని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొన్నిచోట్ల చైనా భారీ సంఖ్యలో ఆయుధాలు, యుద్ధట్యాంకులు కూడా మోహరించింది.

కాగా, వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట చైనా సైన్యం మే నెలనుంచే భారీగా బలగాలను మోహరించిందని కేంద్రం వెల్లడించింది. పెద్దమొత్తంలో ఆయుధాలను ఎల్‌ఏసీ వద్దకు చేర్చి రెండుదేశాల మధ్య ఉన్న అన్ని నియమాలనూ ఉల్లంఘించిందని పేర్కొంది. ఒకవైపు చర్చలంటూనే సరిహద్దుల్లో భారీగా నిర్మాణాలు చేపట్టి సైన్యాన్ని తరలించిందని మండిపడింది.

గల్వాన్‌ ఘర్షణకు చైనా సైన్యమే కారణమని భారత విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ పునరుద్ఘాటించారు. ‘గల్వాన్‌ ప్రాంతంలో సాధారణంగా జరిగే భారత పెట్రోలింగ్‌ను మే ప్రారంభంలోనే చైనా అడ్డుకోవటం మొదలుపెట్టింది’ అని ఆయన తెలిపారు. మరోవైపు భారత్‌- చైనా మధ్య వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకో వాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సూచించారు.

కాగా, సైనిక దళాల మోహరింపును చైనా పెంచుతుండడంతో చైనాతో గల 3,488 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి తమ సైనిక బలగాలను కూడా పెంచాలని భారత్ నిర్ణయించింది. సైన్యంతోపాటు ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు బలగాలతోపాటు ఆ యుధ సామగ్రిని ఎల్‌ఏసీ వద్ద మోహరించాలని భారత్ నిర్ణయించింది