పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధరే ఎక్కువ

దేశంలో వరుసగా 18వ రోజూ పెట్రో ధరలు పెరిగాయి. అయితే ఈసారి డీజిల్‌ ధరను మాత్రమే పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. లీటర్‌ డీజిల్‌పై 48 పెంచగా, పెట్రోల్‌ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో మొదటిసారిగా పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధర అధికమయ్యింది. 

\తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.79.88కి చేరగా, పెట్రోల్‌ ధర రూ.79.76గా ఉంది. దీంతో గత 18 రోజుల్లో దేశ రాజధానిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.8.50, రూ.10.48 చొప్పున పెరిగాయి. కాలుష్యంకు కారణం అవుతున్న డీజిల్ వాహనాలను వాడకుండా నిరుత్సాహం పరచడం కోసం పెట్రోల్, డీజిల్ ధరలు సమానంగా ఉంచాలని చాలాకాలంగా పర్యావరణవేత్తలు కోరుతున్నారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2012, జూన్‌ 18న దేశంలో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.71.16, డీజిల్‌ ధర రూ.40.91గా ఉన్నది. ప్రస్తుతంతో పోల్చితే లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.8 పెరగగా, డీజిల్‌ ధర 39.15 పైసలు పెరిగింది. గత మార్చి 14న ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని లీటర్‌కు రూ.3 విధించగా, మే 5న పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13 పెంచింది. ఈ రెండు పెంపులతో ప్రభుత్వానికి అదనంగా రూ.2 లక్షల కోట్లు వచ్చాయి.

అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోతున్న తరుణంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉండడంతో ఆందోళన కలిగిస్తున్నది. ఈ ప్రభావం మొత్తం  ప్రజా జీవనంపై ఉండే అవకాశం ఉంది. కరోనా, లాక్ డౌన్ ల కారణంగా ఆదాయాలను భారీ స్థాయిలో కోల్పోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ లపై వచ్చే ఆదాయంపై కన్ను వేయడమే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. 

ప్రస్తుతం 60 శాతంకు పైగా అమ్మకపు ధరలో వివిధ పన్నులు ఉంటున్నాయి. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఆదాయం కోసం పలు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ వస్తువులపై పన్నులు పెంచాయి.