పతంజలి కరోనా మందు విడుదల 

ప్రపంచాన్ని వణికిస్తున్న కంటికి కనిపించని మహమ్మారికి చెక్‌ పేట్టేందుకు ఆయుర్వేద మందు వచ్చేసింది. ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి దీన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ‘కొరోనిల్‌’ పేరుతో ఈ మందును ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా మంగళవారం హరిద్వారలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు.
 
“కరోనా కోసం మందు కనిపెట్టాలని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఇవాళ నిరూపించాము. మొదటి ఆయుర్వేదిక్‌ మందును తయారు చేశాం. 100 మందిపైన క్లినికల్‌ ట్రయల్స్‌ చేశాం. మూడు రోజుల్లో దాదాపు 65 శాతం మంది కోలుకున్నారు” అని రామ్‌దేవ్‌ బాబా వెల్లడించారు. 
 
ఏడు రోజుల్లో 100 శాతం రోగులకు జబ్బు తగ్గిపోయిందని, సమగ్రమైన పరిశోధన‌ చేసి ఈ మందును కనుగొన్నామని ఆయన తెలిపారు. ఈ మందు‌కు 100శాతం రికవరీ రేట్‌ ఉందని, జీరో శాతం డెత్‌ రేట్‌ ఉందని తెలిపారు. ఔషధం  తయారీలో అన్ని శాస్త్రీయ నిబంధనలను పాటించామని చెప్పారు.  150కి పైగా ఔషద మొక్కలను వాడినట్లు పేర్కొన్నారు.

రాజస్థాన్ జైపూర్ నిమ్స్ వైద్యులతో పాటు పలువురు శాస్త్త్రవేత్తల సహకారంతో దీన్ని రూపొందించామని రాందేవ్ చెప్పారు. ఈ మందును  అభివృద్ధి చేసేందుకు శాస్త్రీయవేత్తల బృందం పనిచేస్తోందని సీఈవో ఆచార్య బాలకృష్ణ ఈ నెల మొదట్లోనే ప్రకటించారు.

పతంజలి రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (పీఆర్‌‌ఐ), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌ జైపూర్తో కలిసి దివ్య ఫార్మసీ ఆఫ్‌ ది పతంజలి దీన్ని రూపొందించినట్లు తెలిపారు.