
పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధాలు నెరిపేందుకు చట్టబద్ధమైన వయసును 18 నుండి 16 ఏళ్లకు తగ్గించడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇటువంటి మార్పు వల్ల బాలల అక్రమ రవాణా మరింతగా పెచ్చరిల్లుతుందని, లైంగిక దుర్వినియోగ సంఘటనలు ఎక్కువవుతాయని హెచ్చరించింది. బాలల రక్షణ చట్టాలు నీరుగారుతాయని ఆందోళన వెలిబుచ్చింది.
ఈ మేరకు కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భటి రాతపూర్వకమైన వాదనలను సుప్రీంకోర్టుకు అందచేశారు. లైంగిక వేధింపులకు గురయ్యే చిన్నారుల్లో మెజారిటీ బాధితులు తమకు బాగా తెలిసిన వారినుండే ఈ రకమైన ప్రవర్తనను ఎదుర్కొంటారని పేర్కొంటూ 2007 నాటి అధ్యయన వివరాలు ఉదహరించింది. మైనర్లకు అంత అవగాహనా స్థాయి వుండదని, అందువల్ల వారు నిజాయితీగా సమ్మతి లేదా ఆమోదం ఇవ్వలేరని వాదించింది.
వారికి రక్షణ కల్పించేందుకే 18 ఏళ్ల వయసు పరిమితిని విధించినట్లు పేర్కొంది. బాల్య వివాహాల చట్టం, బాలనేరస్తుల చట్టం వంటి ఇతర చట్టాలకు అనుగుణంగా ఈ పరిమితి వుంటుందని పేర్కొంది. ప్రస్తుత చట్టం ప్రకారం 18ఏళ్ల లోపు బాలికతో లైంగిక చర్యను అత్యాచారం కింద పరిగణిస్తారు. భారతదేశ రాజ్యాంగానికి, అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా, లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా బలమైన రక్షణ కవచంగా చట్టం పనిచేయాలని కేంద్రం పేర్కొంది.
More Stories
అయోధ్య సమీపంలో భారీ పేలుడు – ఐదుగురు మృతి
జార్ఖండ్లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం
బీహార్ లో తొలగించిన 3.66 లక్షల ఓట్ల వివరాలు వెల్లడించండి