చైనా ఒక్క అంగుళం కూడా చొరబడలేదు

చైనా ఒక్క అంగుళం కూడా చొరబడలేదు
 

భారత భూభాగంలోకి ఒక్క అంగుళం కూడా చైనా చొరబడింది లేదని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు పార్లమెంటులో ప్రకటించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. 1962 నుంచి ఇదే పరిస్థితి అని మంగళవారం లోక్‌సభకు వెల్లడించారు. రికార్డులను సరిచేయడం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

 
“నా సొంత రాష్ట్రం (అరుణాచల్‌ ప్రదేశ్‌) లోకి చైనా ప్రవేశించి, ఆక్రమణలకు పాల్పడిందని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ చెప్పారు. దీనిపై స్పష్టత ఇవ్వడం ముఖ్యమని నేను భావించాను. అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రస్తుతం చైనా అధీనంలో ఉన్న ప్రాంతం 1962 యుద్ధానికి ముందు లేదా ఆ సమయంలో స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అలాంటి పరిస్థితి ఎన్నడూ తలెత్తలేదు” అని కిరణ్‌ రిజిజు వెల్లడించారు.
 
“వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎఇ) వెంబడి భారత్‌ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని గతంలో పలు కథనాలు వెలువడ్డాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల పేర్లను మార్చడానికి చైనా ప్రయత్నించినట్లు కూడా ప్రచారం సాగించింది. అయితే ఆ కథనాలను ప్రభుత్వం తిరస్కరిస్తూ వచ్చింది” అని గుర్తు చేశారు. 
 
అరుణాచల్‌ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమని.. అది విడదీయరాని భాగమని, పేర్లు మార్చినంత మాత్రాన ఈ వాస్తవాన్ని మార్చలేరు’ అని ఇదివరకే స్పష్టం చేసాం అని కిరణ్‌రిజిజు పేర్కొన్నారు.  గత ఏడాది నుంచి ఇరు దేశాల మధ్య గస్తీ విషయంలో స్నేహం కుదిరింది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్‌ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు. గల్వాన్‌ ఘర్షణ తర్వాత దెబ్బతిన్న సంబంధాలు.. ఆ ఒప్పందం తర్వాత మెరుగైన సంగతి తెలిసిందే.