కేంద్రాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే కుత్రిమ ఎరువుల కొరత

కేంద్రాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే కుత్రిమ ఎరువుల కొరత

కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే రాష్ట్రంలో కుత్రిమ ఎరువుల కొరత సృష్టిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామంచంద్రరావు ఆరోపించారు. జోగులాంబ గద్వాలలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికె అరుణతో కలిసి విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై నిందలు మోపుతోందని మండిపడ్డారు.

యుపిఎ పాలనలో రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సి వచ్చేదని, అప్పట్లో యూరియా కొరతతో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశా రు. క్యూలైన్లలో పోలీసులు లాఠీచార్జీలు చేసేవారని, కానీ మోదీ ప్రభుత్వం వచ్చాక, ఇంపోర్టెడ్ యూరియాను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు.  తెలంగాణకు అవసరమైన 9.5 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువగా 12.02 లక్షల మె ట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం సరఫరా చేసిందని చెప్పారు.

ఇది అవసరానికి మించి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు సరఫరా చేశారని, అయినప్పటికీ రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి  జెపి నడ్డాను కలిసినప్పుడు తెలంగాణకు అవసరమైన యూరియాను కేంద్రం పూర్తిగా పంపిణీ చేస్తుందని తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే కేంద్రం తెలంగాణకు అవసరమైన మేరకు యూరియా పంపుతున్నప్పటికీ మార్కెట్‌లో యూరియా కొరత ఎందుకు ఏర్పడిందని విస్మయం వ్యక్తం చేశారు. 

దీనిపై దర్యాప్తు చేయాలని రేవంత్ రెడ్డిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొంతమంది దళారులు యూరియాను దాచిపెట్టేందుకు ప్రోత్సాహిస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎరువుల కొరత తెలంగాణలోనే ఎందుకు వస్తోందనే అంశంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎరువుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. 

ఈ ప్రభుత్వం రైతులకు, యువతకు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, ఇది బిసిల పట్ల కూడా వ్యతిరేక దృక్పథం కలిగిన ప్రభుత్వం అని రామచందర్ రావు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తూ అందులో మతపరంగా 10 శాతం రిజర్వేషన్లు కలుపాలనుకోవడం సరైంది కాదని హెచ్చరించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను రైతులు నిలదీయాలని, ఎరువులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించాలని ఆయన పిలుపిచ్చారు. గద్వాల కాటన్ సీడ్ ఉత్పత్తిలో కీలకంగా నిలుస్తోంది కానీ ఇక్కడ రైతులకు సాగునీటి సదుపాయం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన మద్దతు అందడం లేదని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు జెడ్పి స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ప్రజలు మార్పు కోరుతున్నారని, బీజేపీపై విశ్వాసం చూపుతున్నారని చెప్పారు. 

ప్రజలు బిఆర్ఎస్ అవినీతి పాలనను చూశారని, కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాల పాలనను చూశారని, ఇప్పుడు ప్రజలు బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారని తెలిపారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని బిజెపి నేత పిలుపిచ్చారు. మనమంతా కట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయం అని భరోసా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వికసిత్ తెలంగాణగా మారాలంటే బిజెపి విజయం సాధించాలని స్పష్టం చేశారు.