కేదార్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక అంతరాయం

కేదార్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక అంతరాయం
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి.  అనేక జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఈ వర్షాలు, వరదల కారణంగా చార్‌ధామ్‌ యాత్రకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొండచరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్‌ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

రుద్రప్రయాగలో శనివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో గౌరీకుండ్‌ నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ రహదారి మొత్తం బండరాళ్లతో మూసుకుపోయింది. దీంతో అధికారులు ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. దీంతో కేదార్‌నాథ్‌ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఆ మార్గంలో రహదారిని క్లియర్‌ చేసే పనులు కొనసాగుతున్నాయి.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం తెల్లవారుజామున నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఈ వర్షం కారణంగా అగస్త్యమునిలోని బేడు బాగడ్‌ ప్రాంతంలో గల రమ్సీ వాగు పొంగిపొర్లుతోంది. దీంతో కేదార్‌నాథ్‌ హైవే సమీపంలోని అనేక ఇళ్లు, హోటళ్లు, పార్కింగ్‌ ప్రాంతాలు నీట మునిగాయి. అనేక వాహనాలు బురద నీటిలో కూరుకుపోయాయి. 

ఉత్తరకాశీలోని ఫూల్‌చట్టి సమీపంలో యమునోత్రి జాతీయ రహదారి దాదాపు 100 మీటర్ల పొడవున మునిగిపోయింది. మరోవైపు బాగేశ్వర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం కాప్కోట్ బ్లాక్‌లో 74 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కొండచరియలు విరిగిపడటం వల్ల ఈ ప్రాంతంలో తొమ్మిది రోడ్లు మూసుకుపోయాయి. రోడ్డు క్లియరెన్స్ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.