బెట్టింగ్ యాప్‌ కేసులో నలుగురు సెలబ్రిటీలకు నోటీసులు

బెట్టింగ్ యాప్‌ కేసులో నలుగురు సెలబ్రిటీలకు నోటీసులు

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నలుగురు టాలీవుడ్‌ ప్రముఖ నటీనటులకు సమన్లు జారీ చేసింది. హీరో విజయ్‌ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్‌, మంచు లక్ష్మిలకు సమన్లు పంపి.. విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నెల 23న రానా దగ్గుబాటి, జులై 30న ప్రకాశ్‌ రాజ్‌, ఆగస్టు 6న విజయ్‌ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మిని విచారణకు హాజరుకావాలని సూచించింది. 

ఇదే కేసులో పేరున్న మిగతా వారికి సైతం దశలవారీగా సమన్లు జారీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంలో మొత్తం 29 మంది నటీనటులతో పాటు కంటెంట్‌ క్రియేటర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సలర్లపై ఈడీ కేస్‌ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసిఐఆర్) నమోదు చేసి సమన్లు పంపింది. అక్రమ బెట్టింగ్‌పై పంజాగుట్ట, మియాపూర్‌, సైబరాబాద్‌, విశాఖపట్నంలలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి విచారిస్తున్నది.

ఈ బెట్టింగ్ యాప్‌లతో మనీలాండరింగ్‌, హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అయినప్పటికీ గూగుల్‌, మెటా సంస్థలు ఇలాంటి యాప్‌లను తమ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.  ఈ టెక్‌ కంపెనీలు బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే గాక, వెబ్‌సైట్ల లింక్‌లను కూడా అందుబాటులో ఉంచుతున్నాయని ఈడీ పేర్కొంది. 

బెట్టింగ్ యాప్‌ల ద్వారా పెద్ద ఎత్తున మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు విష‌యంలో ఈడీ జోరు పెంచింది. కాగా, సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయిన‌ నీతూ అగర్వాల్, విష్ణు ప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత వంటి పేర్లు కూడా ఇందులో ఉన్నాయి.

 వీరితోపాటు మరికొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ల పైకూడా ఈడీ కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే యాంకర్లు విష్ణు ప్రియ, రీతు చౌదరి, శ్రీముఖి, శ్యామలను విచారించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో గూగుల్‌, మెటా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. టెక్‌ కంపెనీలు బెట్టింగ్‌ యాప్‌ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడం, వెబ్‌సైట్ల లింక్స్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లుగా ఆరోపణలున్నాయి.