ఇప్పుడు రైతుల శ్రేయస్సు గురించి మాట్లాడటం సిగ్గుచేటు

ఇప్పుడు రైతుల శ్రేయస్సు గురించి మాట్లాడటం సిగ్గుచేటు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా, ఇప్పటికీ రైతుల సమస్యల గురించి పట్టించుకోకుండా,  ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్నాయని రైతుల శ్రేయస్సు గురించి మాట్లాడటం సిగ్గుచేటని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు.  బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో మాట్లాడుతూ  ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన “రైతు భరోసా”ను పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. 
ధరణిని భూభారతిగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులకు ఉపశమనంగా మారాల్సిన ఈ వ్యవస్థను సమస్యల కూపంగా మార్చిందని ధ్వజమెత్తారు. అనేకమంది రైతులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెబుతూ  వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం, సాంకేతిక లోపాలు రైతుల భూముల విషయంలో ఇబ్బందులకు దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రైతులకు జరుగుతున్న మేలు, నష్టాలపై కిసాన్ మోర్చా నాయకులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని రాంచందర్ రావు సూచించారు.
హైకోర్టు చివాట్లు పెట్టిన తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 6 వేల చొప్పున రైతు భరోసా ఇచ్చినట్లు చెబుతోందని అంటూ ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు రూ. 15,000 చొప్పున భరోసా అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, తరువాత దానిని రూ. 12,000కి తగ్గించిందని విమర్శించారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, హడావుడిగా కేవలం రూ. 6,000 చొప్పున మాత్రమే నిధులు విడుదల చేసిందని చెప్పారు.

ఒకవైపు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలిచ్చే పరిస్థితి లేదని,  రిటైర్మెంట్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదని చెప్పారు.  మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో మార్కెటింగ్, రుణ సదుపాయాలు కల్పిస్తోందని, 14 రకాల పంటలకు ఎంఎస్పీ పెంచిందని గుర్తు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అబద్ధపు ప్రచారంతో ప్రజల దృష్టిని మరల్చుతోందని మండిపడ్డారు.

యూపీఏ హయాంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని,  రాత్రి పగలు ఫర్టిలైజర్ షాపుల ముందు పడిగాపులు కాసేవారని, చెప్పులు క్యూలైన్లలో పెట్టి మరీ వేచి ఉండేవారని గుర్తు చేశారు.  నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక, బ్లాక్ మార్కెటింగ్ ను నిర్మూలించేలా నీమ్ కోటెడ్ యూరియా ను అన్ని రాష్ట్రాలకు సరిపడేలా పంపిణీ చేస్తోందని చెప్పారు.  కాని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యూరియా పంపిణీ చేయలేదని, యూరియా కొరత ఉందని అవాస్తవాలు ప్రచారం చేస్తోందని రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాస్తవానికి 2024–25 రబీ సీజన్‌ కోసం అవసరమైన 9.5 లక్షల మెట్రిక్ టన్నులకు బదులుగా, కేంద్రం 12.02 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా యూరియాను తెలంగాణ రాష్ట్రానికి పంపిణీ చేసిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ ఎన్నికల రాజకీయ లబ్ధి కోసమే యూరియా కొరత అంటూ అపోహలు సృష్టిస్తోందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పుడు 14 పంటలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటికీ ఆ బోనస్ చెల్లింపులు ఎక్కడా జరగలేదని గుర్తు చేశారు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డులు, ఫసల్ బీమా యోజనతో మోదీ ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తుందని సాగునీటిని విస్తరించేందుకు ప్రధాన్ మంత్రి కృషి సించాయీ యోజన అమలు చేస్తోందని చెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి పంట నష్టపోయిన రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. కాని రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం లేదని బిజెపి నేత ధ్వజమెత్తారు.