అజ్ఞాత ఎంఎల్ నేత కామ్రేడ్ విజయ్ మృతి

అజ్ఞాత ఎంఎల్ నేత కామ్రేడ్ విజయ్ మృతి
భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (మార్క్సిస్ట్‌-లెనినిస్టు) (యూసీసీఆర్‌ఐ-ఎంఎల్‌) నేతగా నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్ కేంద్రంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో అజ్ఞాతంగా కార్యకలాపాలు జరుపుతున్న కామ్రేడ్‌ విజయ్‌ (74) ఈ నెల 12న మల్టీ ఆర్గాన్స్‌ ఫెయిల్యూర్‌తో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. 
 
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం లంకపల్లి గ్రామం. 1951 మార్చి 19న జన్మించారు. ఆయన పూర్తి పేరు శిష్ట్లా విజయ్‌శర్మ. తల్లిదండ్రులు వెంకట సుబ్బమ్మ, ఎస్‌ఆర్‌ఆర్‌ స్వామి. ఆయన సోదరుడు ప్రముఖ జర్నలిస్టు సుబ్బారాయుడు. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండటంతో లైబ్రరీల్లోనే చదువుకుంటూ మెట్రిక్‌, పీయూసీ పూర్తిచేశారు. తర్వాత ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ సబ్జెక్టుకు సమానమైన ఏఎంఐఈ పరీక్ష పాసయ్యారు.

ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌ఎఫ్‌సీలో ఉద్యోగంలో చేరారు. తన సోదరుడు సుబ్బరాయుడు అప్పట్లో విప్లవకారుల కార్యకలాపాలకు కేంద్రంగా ఉండటం, ఆయనకు స్వతహాగా కమ్యూనిజం భావాలు ఉండటంతో అటువైపు ఆకర్షితులయ్యారు. ఎన్‌ఎఫ్‌సీలో కార్మికులను కూడగట్టి సంఘాలు ఏర్పాటు చేశారు. 

అలా యూసీసీఆర్‌ఐ-ఎంఎల్‌  వైపు అడుగులు వేశారు. 1975 నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ హైదరాబాద్‌ కేంద్రంగా ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ విస్తృతి కోసం అనేక పోరాటాలు చేశారు. 1981లో ఎన్‌ఎఫ్‌సీకి రాజీనామా చేసి కార్మిక సమస్యలపై పోరాడారు. తన కార్యకలాపాలను జంటనగరాలలోని ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు, కార్మిక కేంద్రాలకు విస్తరింపజేశారు. 

దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డిల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై చేసిన అధ్యయనాలు జరిపారు.  1981 నుంచి 1991 వరకూ తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎన్నో ఉద్యమాలు చేశారు. 1999 మార్చిలో విజయ్‌ను అరెస్టు చేసి, చిత్రహింసలు పెట్టి చావు అంచులవరకూ తీసుకెళ్లారు.  ఉన్నత చదువులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ఇవ్వని సంతృప్తిని ప్రజా ఉద్యమాలు ఇచ్చాయని అనేవారు.