క్షణాలకే విమానానికి ఇంధన సరఫరా ఆగిపోయింది!

క్షణాలకే విమానానికి ఇంధన సరఫరా ఆగిపోయింది!
ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలిపోయిన దుర్ఘటన జరిగి శనివారానికి సరిగ్గా నెల రోజులైంది.  ప్రమాదానికి కీలక కారణంగా విమానం టేకాఫ్‌ అయ్యాక ఇంజిన్‌ ఇంధన కంట్రోలర్‌ స్విచ్‌లు ఒక సెకను పాటు ఆగిపోయినట్లు ఏఏఐబీ ప్రాధమిక నివేదికలో పేర్కొంది. ఈ సమయంలోనే పైలట్‌ ఎందుకు స్విచ్‌ ఆఫ్‌ చేసినట్లు మరో పైలట్‌ను ప్రశ్నించాడన్న ఏఏఐబీ తాను స్విచ్‌ ఆఫ్ చేయలేదని సమాధానం ఇచ్చినట్లు తెలిపింది. 
 
కాక్‌పీట్‌లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఆతర్వాత వారు మేడే కాల్‌ ఇచ్చారని వివరించింది. వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ స్పందించినప్పటికీ అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపింది. ఈలోపే విమానం కూలిపోయిందని ఏఏఐబీ నివేదికలో పేర్కొంది. గత నెల 12న యిర్‌ ఇండియా బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ 787-8 విమానం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. 
 
ఈ ప్రమాదంలో 270 మంది మరణించారు. ఈ ప్రమాద ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగెంట్‌ బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. 
మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. విమానం టేకాఫ్‌ అయ్యాక ఇంధన కంట్రోలర్‌ స్విచ్‌లు సెకన్‌ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది.

ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పూర్తిగా పరిశీలించామని, విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికితీసిశామని తెలిపింది. వాటిని భద్రపరిచినట్లు పేర్కొంది. ప్రమాదానికి ముందు విమానంలో ఫ్యూయెల్‌, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని తెలిపింది. అదేవిధంగా విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏవీ లేవని వెల్లడించింది.

విమానం టేకాఫ్ అయిన సెకను వ్యవధిలోనే రెండు ఇంధన కటాఫ్ స్విచ్‌లు ఆఫ్‌ అయ్యాయి. దీంతో రెండు ఇంజిన్లు గాలిలోనే ఆగిపోయాయి. రెండు స్విచ్‌లు ఒకేసారి ఆఫ్‌ అవడంతో ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో ఇంజిన్లు గాలిలోనే నియంత్రణ కోల్పోయాయని ఏఏఐబీ పేర్కొంది. ఇది పలు సందేహాలకు తావిస్తున్నదని వెల్లడించింది. 

రెండు ఇంజిన్లు ఒకేసారి ఆగిపోయే ముందు విమానం 180 నాట్ల గరిష్ట వేగానికి చేరుకుంది. అయితే ఇంధన స్విచ్‌లను ఆపివేయడంతో వేగం, ఎత్తులో వేగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. విమానం ప్రయాణిస్తున్న మార్గంలో పక్షులు తిరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ప్రమాదానికి అది కారణం కాదని తన నివేదికలో నిర్ధారించింది.

కొద్దిసేపటికే ఎయిర్ పోర్టు సరిహద్దుల బయట విమానం కుప్పకూలింది. కాలేజీ హాస్టల్ భవనంపై పడిపోయింది. విమానంలో పూర్తి స్థాయిలో ఇంధన నిల్వలు ఉండటంతో మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయి. విమానంలోని వారు, కాలేజీ హాస్టల్‌లోని విద్యార్థులు, నేలపై ఉన్నవారు కూడా కాలి బూడిదయ్యారు. పైలట్ పొరపాటున విమానానికి ఇంధన సరఫరా ఆపేశాడా? లేక దానంతట అదే ఆగిపోయిందా? అన్నది తెలియాల్సి ఉంది.

కాగా, ఇంధన సరఫరా స్విచ్‌లో లోపం తలెత్తినట్లు ఏఏఐబీ సమర్పించిన నివేదికపై బోయింగ్‌ సంస్థ స్పందించింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. విమాన ప్రమాదంలో చనిపోయిన వారి చుట్టూ తమ ఆలోచనలు తిరుగుతున్నాయని విచారం వ్యక్తంచేసింది. విచారణకు, తమ కస్టమర్‌కు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది.

ముఖ్యాంశాలు ఇవే!

* విమానం టేకాఫ్ తీసుకున్న త‌ర్వాత క్ష‌ణాల్లోనే రెండు ఇంజిన్లు ష‌ట్‌డౌన్ అయ్యాయి. ఫ్యూయ‌ల్ క‌ట్ఆఫ్ స్విచ్‌లు.. ర‌న్ నుంచి క‌టాఫ్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. అది కేవ‌లం సెక‌న్‌లోనే జ‌రిగింది. విమాన ఇంజిన్ల‌కు ఇంధ‌న స‌ర‌ఫ‌రా నిలిచిపోయిన‌ట్లు రిపోర్టులో వెల్ల‌డించారు.

* కాక్‌పిట్ ఆడియో సంభాష‌ణ విడుదల చేశారు. ఫ్యూయ‌ల్‌ను ఎందుకు క‌టాఫ్ చేశావ‌ని ఓ పైల‌ట్‌ను మ‌రో పైల‌ట్ అడిగాడు. తానేమీ క‌ట్ చేయ‌లేద‌ని ఆ పైల‌ట్ స‌మాధానం ఇచ్చాడు.

* ఇంజిన్ల‌కు ప‌వ‌ర్ స‌ప్ల‌య్ ఆగిపోవ‌డంతో రామ్ ఎయిర్ ట‌ర్బైన్‌ ఓ చిన్న‌పాటి ప్రొపెల్ల‌ర్ లాంటి డివైస్‌ను ఆన్ చేశారు.ఆటోమెటిక్‌గా ఆ డివైస్ హైడ్రాలిక్ ప‌వ‌ర్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. ఏఏఐబీ సేక‌రించిన సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా ఆర్ఏటీ వినియోగించిన‌ట్లు తెలుస్తోంది.

* ఇంజిన్ల‌ను రిస్టార్ట్ చేసేందుకు పైలెట్లు ప్ర‌య‌త్నించారు. ఎన్‌1 లేదా ఇంజిన్ 1.. పాక్షికంగా రిక‌వ‌రీ అయ్యింది. కానీ కూల‌డానికి ముందు ఇంజిన్ 2 మాత్రం రిక‌వ‌రీ కాలేక‌పోయిన‌ట్లు రిపోర్టులో తేలింది.

* కేవ‌లం 32 సెక‌న్లు మాత్రం విమానం గాలిలో ఎగిరింది. ర‌న్‌వేకు 0.9 ఎన్ఎం దూరంలో విమానం కూలి ఓ హాస్ట‌ల్‌పై ప‌డింది.

* త్ర‌స్ట్ లివ‌ర్స్ ఐడిల్‌గా ఉన్న‌ట్లు గుర్తించారు. కానీ టేకాఫ్ స‌మ‌యంలో త్ర‌స్ట్ ఆన్‌లో ఉన్న‌ట్లు బ్లాక్‌బాక్సు ద్వారా తెలుస్తోంద‌న్నారు.

* టేకాఫ్ స‌మ‌యంలో ఫ్లాప్ సెట్టింగ్‌(5 డిగ్రీలు), రియ‌ర్‌(డౌన్‌) సాధార‌ణంగా ఉన్న‌ట్లు తేల్చారు. ప‌క్షి ఢీకొట్ట‌డం కానీ.. వాతావ‌ర‌ణ సంబంధిత స‌మ‌స్య‌లు లేవ‌న్నారు. ఆకాశం కూడా క్లియ‌ర్‌గా ఉంది. విజిబులిటీ బాగుంది. గాలి స్వ‌ల్పంగా వీస్తుంది.

* ఏఏఐబీ రిపోర్టు ప్ర‌కారం పైలెట్ల ట్రాక్ రికార్డు కూడా క్లియ‌ర్‌గా ఉంద‌ని తెలిపారు. ఇద్ద‌రూ మెడిక‌ల్‌గా ఫిట్ ఉన్నారు. కావాల్సినంత అనుభ‌వం ఉంది.

* విమానంపై దాడి జ‌రిగిన‌ట్లు ఆధారాలు లేవు. ఫ్యూయ‌ల్ స్విచ్‌లో లోపాలు ఉన్న‌ట్లు ఎఫ్ఏఏ అడ్వైజ‌రీ ద్వారా తెలుస్తోంది. ఎయిర్ ఇండియా రెగ్యుల‌ర్ ఇన్‌స్పెక్ల‌న్లు చేయ‌లేదు. విమానం బ‌రువు, బ్యాలెన్స్ ప‌రిమితుల‌కు త‌గిన‌ట్లే ఉంది. ప్ర‌మాద‌క‌ర‌మైన వ‌స్తువులు కూడా దాంట్లో లేవు.