భూ తాపాన్ని త‌గ్గించేందుకు గవర్నర్ త్రిముఖ వ్యూహం

భూ తాపాన్ని త‌గ్గించేందుకు గవర్నర్ త్రిముఖ వ్యూహం

పెరుగుతున్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల నేప‌థ్యంలో భూ తాపాన్ని త‌గ్గించేందుకు దేశ ప్ర‌ధాని పిలుపుమేర‌కు త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగాల‌ని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. బీఈఈ దక్షిణ భార‌త‌ ప్రాంతీయ మీడియా సలహాదారు ఎ. చంద్ర శేఖర రెడ్డి, ఈఈఎస్ఎల్‌ సీనియర్ అధికారులతో కలిసి శుక్ర‌వారం ఇంధన సామర్థ్య రంగంలో కీలక పరిణామాలపై గవర్నర్‌ను క‌లిసి వివరించారు. 

ఈసంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ వ‌ర్మ మాట్లాడుతూ, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ప్ర‌భుత్వాల‌తోపాటు ప్ర‌జ‌లు కూడా ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని కోరారు. ఈ విధానం ఆర్ధిక‌, పర్యావరణంతోపాటు సమాజానికి గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని స్పష్టం చేశారు. వాతావరణ చర్యల‌పై ప్రపంచ సమాజాన్ని ఏకం చేసే దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని పిలుపునిచ్చారు. 

పునరుత్పాదక విద్యుత్‌ని ప్రోత్సహించడం, ఇంధన సామర్థ్య చర్యలను వేగవంతం చేయడంలో విద్యుత్‌, రవాణా, భవనాలు, గ్రామీణ మరియు పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, చిన్న , మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ) సహా అన్ని సంబంధిత విభాగాల ప్రమేయం అవ‌స‌ర‌మ‌న్నారు. వాతావరణ మార్పు ప్రభావాలను తగ్గించడంలో ఇంధన సామర్థ్యం మాత్రమే 40 శాతం కంటే ఎక్కువ దోహదపడుతుందని చెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వాలకు ఈరంగంలో ప్రపంచ ఉత్తమ పద్ధతులతోపాటు క్లీన్ టెక్నాలజీలను అమలు చేయడంలో పూర్తిస్థాయి మద్దతు ఇచ్చినందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్‌), పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖల‌ సమిష్టి ప్రయత్నాలను గవర్నర్ ప్రశంసించారు. సోలార్ ఎన‌ర్జీని వినియోగించ‌డంలో మహిళలను భాగ‌స్వామ్యం చేయడానికి తెలంగాణ ప్ర‌భుత్వ‌ చొరవలను కూడా ఆయన ప్రశంసించారు.

ఇంధ‌న సామ‌ర్ధ్య చ‌ర్య‌ల‌ను ప్రోత్స‌హించ‌డంలో భాగంగా బీఈఈ ప్రమాణాలు, లేబులింగ్ (ఎస్ అండ్ ఎల్‌) కార్యక్రమం పరిధిని చంద్ర‌శేఖ‌ర రెడ్డి గ‌వ‌ర్న్‌కు వివరించారు.  వీటిలో 39 ఉపకరణాల వినియోగం ఉండ‌గా వాటిలో 16 తప్పనిసరిగా ఉండాల‌ని చెప్పారు. భారతదేశ ఇంధన సామర్థ్యానికి సంబంధించిన కార్బ‌న్ ఉద్గారాల‌ తగ్గింపులలో 60 శాతం దోహదపడుతుంద‌న్నారు. ఎస్ అండ్ ఎల్‌ కార్యక్రమం ద్వారా 2030 నాటికి 1 బిలియన్ టన్నుల ఉద్గారాలను తగ్గించాలనే దేశ వ్యాప్త ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ప‌నిచేస్తున్నామ‌ని వివ‌రించారు.

క్షేత్ర‌ స్థాయిలో ఇంధన సామ‌ర్ధ్య చ‌ర్య‌ల‌ ప్రాముఖ్యతను గుర్తించిన గవర్నర్ ఈఈఎస్ఎల్ ద్వారా రాజ్ భవన్, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) లలో సమగ్ర ఇంధన ఆడిట్ నిర్వహించాలని, వాటిని మోడల్ ఇంధన-సమర్థవంతమైన క్యాంపస్‌లుగా మార్చే సాధ్యాసాధ్యాలను అంచనా వేయాలని సిఫార్సు చేశారు.