
సర్పంచ్ ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానిక సంస్థలకు గత ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ దాఖలైన ఆరు పిటిషన్లపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. మూడు నెలల లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు జస్టిస్ టీ మాధవీదేవి. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించారు.
నల్లగొండ జిల్లా మల్లెపల్లి సర్పంచ్ పార్వతి, కుర్మపల్లి సర్పంచ్ శ్రీనివాస్, జనగామ జిల్లా కాంచనపల్లి సర్పంచ్ విజయ, నిర్మల్ జిల్లా తల్వెడ సర్పంచ్ అనిల్కుమార్, కరీంనగర్ జిల్లా చంగర్ల సర్పంచ్ వేణుగోపాల్, నిజాయతీగూడెం సర్పంచ్ మురళీధర్ వేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి.
స్థానిక సంస్థలకు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉండాలని, పాలకవర్గాల కాలపరిమితి పూర్తికాగానే ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని పిటిషనర్లు వాదించారు.రాజ్యాంగంలోని 243ఈ, 243కే అధికరణాలను, తెలంగాణ గ్రామ పంచాయతీరాజ్ చట్టం- 2018 నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు మరో 30 రోజుల గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా కోరింది. గత విచారణలో కూడా ఇదే తరహాలో వాయిదా కోరిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ వాయిదా కోరడం ఏమిటని హైకోర్టు అసహనం వ్యక్తంచేసింది.
సర్పంచ్ ఎన్నికల్ని ఇంతవరకూ ఎందుకు నిర్వహించలేదని రేవంత్ సర్కార్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలోనే సర్పంచ్ ఎన్నికల పదవీకాలం పూర్తయితే, ఇప్పటిదాకా ఎందుకు నిర్వహించలేదో వివరణ ఇవ్వాలని నిలదీసింది. బీసీ రిజర్వేషన్ల అంశం తేల్చేందకు డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటుచేశామని, బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడమే తమ ముందున్న అంశమని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించాక ఎన్నికల నిర్వహణకు తమకు రెండు మాసాల వ్యవధి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత