ఇజ్రాయెల్‌ నుంచి 160 మంది భారతీయుల తరలింపు

ఇజ్రాయెల్‌ నుంచి 160 మంది భారతీయుల తరలింపు
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడులు, అమెరికా సైతం ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై తాజాగా దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్ నుంచి ‘ఆపరేషన్ సింధు’ పేరుతో భారతీయులను వెనక్కి తీసుకువచ్చిన భారత ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆపరేషన్‌ను ఇజ్రాయెల్‌ కూడా విస్తరించింది. ఇజ్రాయెల్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోంది.
 
ఆపరేషన్‌ సింధూలో భాగంగా చేపట్టిన పౌరుల తరలింపు సంయుక్త ఆపరేషన్‌లో ఇజ్రాయెల్‌, జోర్డాన్‌ల నుంచి ఆదివారం మొదటి విడతగా 160 మంది భారతీయులను సురక్షితంగా భారత్‌కు తరలించారు. ఇజ్రాయెల్‌ గగనతలం మూసివేయడంతో తొలివిడతగా 160 మంది మన పౌరులను భూ మార్గం ద్వారా సరిహద్దు దాటించి జోర్డాన్‌కు చేర్చారు. అక్కడ ఇమ్మిగ్రేషన్‌ తనిఖీలు జరిపిన తర్వాత వారిని అమ్మన్‌ విమానాశ్రయానికి తరలించారు. వారిని సురక్షితంగా తీసుకురావడానికి అమ్మన్‌ నుంచి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసినట్లు భారత విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇజ్రాయెల్‌లో ఉంటూ స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులను వెనక్కి తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) ప్రకటించింది.  ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత ఇజ్రాయెల్ తమ దేశ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దానితో ముందుగా ఇజ్రాయెల్ నుంచి భూ సరిహద్దుల ద్వారా, తరువాత భారత్‌కు వాయుమార్గం ద్వారా ప్రయాణ సౌకర్యం కలిస్తామని తెలిపింది. విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు భారత్ అధిక ప్రాధాన్యమిస్తుందని తెలిపింది.

భారత్ చేరుకోవాలనుకునే వారు టెల్ అవివ్‌లోని రాయబార కార్యాలయంలో తమ పేర్లు రిజిస్టర్ చేయించుకోవాలని ఎంఈఏ సూచించింది. ఇప్పటికీ రిజిస్టర్ చేయించుకోని వారు అధికారిక పోర్టల్ www.indembassyisrael.gov.in/indian_national_reg లో రిజిస్టర్ చేయించుకోవాలని కోరింది. 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, +972 54-7520711 and +972 54-3278392 నెంబర్లలో సంప్రదించాలని, ఇ-మెయిల్ హెల్ప్‌లైన్ cons1.telaviv@mea.gov.in. కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇజ్రాయెల్‌లో సుమారు 18,000 మంది భారతీయులు ఉంటున్నారు.

మరోవంక, భారత ప్రభుత్వం ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు కోసం ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ సింధూర్’ కొనసాగుతోంది.  భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధులో భాగంగా 311 మంది భారతీయులతో మహాన్ ఎయిర్ ఫ్లైట్ (డబ్ల్యు50071ఏ) సురక్షితంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారంనాడు చేరుకుంది.  వీరిలో ఎక్కువమంది ఇరాన్‌లో చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులే ఉండగా, ఇందులోనూ 200 మంది వరకూ కశ్మీర్ విద్యార్థులు ఉన్నారు. కాగా, ఇంతవరకు ఇరాన్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయుల సంఖ్య 1428 మందికి చేరినట్టు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.