 
                బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2023 ఎన్నికలకు రెండు నెలల ముందు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం వెయ్యి మంది నేతల ఫోన్లు ట్యాప్ చేసిన ట్లు ఈ విచారణలో గుర్తించారు. అయితే ఇప్పటివరకు పూర్తిగా సాంకేతికంగా, శాస్త్రీయంగా విశ్లేషించి 600 ఫోన్లు ట్యాప్ చేసినట్లు దర్యాప్తు లో పోలీసులు నిర్థారించినట్లు తెలిసింది. బాధితుల్లో జర్నలిస్టులు, సినీ, ప్రతిపక్ష నేతలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారులు ఉన్నారు.
మావోయిస్టుల పేరు చెప్పి ట్యాపింగ్కు పాల్పడినట్లు సిట్ విచారణలో తేలింది. సాధారణ ఎన్నికల సమయంలో మావోయిస్టులు క్రియాశీలకంగా మారారని చెప్పి, వారి కదలికలపై నిఘాకు అనుమతి కోరినట్లు రివ్యూ కమిటీకి ప్రభాకర్ రావు చెప్పినట్లు తెలిసింది. రివ్యూ కమిటీకి మావోయిస్టుల పేర్ల మీద నెంబర్లను ప్రభాకర్ రావు ఇచ్చినట్లు తేలింది.
హవాలా నిధులు మావోయిస్టులకు చేరవేస్తున్నారన్న సాకుతో వ్యాపారస్థుల నుంచి కోట్ల రూపాయిలు అనధికారికంగా స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు. సాధారణంగా పోలీసులు నగదు, ఇతర వస్తువులు ఏదైనా అధికారికంగా స్వాధీనం చేసుకుంటే ట్రెజరీకి జమ చేసి న్యాయస్థానానికి సమాచారం అందజేయాల్సి ఉంంటుంది. కానీ ఈ వ్యవహారంలో పూర్తిగా అనధికారికంగా కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుని తమ సొంత అవసరాలకు వినియోగించినట్లు సమాచారం.
అలాగే గద్వాల కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య కూడా తమ వాంగూల్మం ఇచ్చారు. ఈ ట్యాపింగ్ వల్ల తాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో సిట్ అధికారులకు వారు వివరించారు. సిట్ విచారణలో బాధితులు చెప్పిన వివరాల మేరకు ప్రభాకర్రావుతో పాటు నలుగురు నిందితులను కూడా కలిపి విచారించాలని సిట్ భావిస్తోంది.
ప్రతి రోజు ప్రభాకర్రావు తమకు బ్రీఫింగ్ ఇచ్చే వారని నలుగురు నిందితులు సిట్ అధికారులకు తెలిపారు. పోల్ -2023 వాట్సాప్ గ్రూప్పై ప్రధానంగా ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నించనుంది. అప్పటి టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డికి సన్నిహితులు గాలి అనిల్, వినయ్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేసి స్వాధీనం చేసుకున్న డబ్బుపై కూడా సిట్ ఆరా తీసింది. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్కు చెందిన కంపెనీల డబ్బును ఫోన్లు ట్యాప్ చేసి టాస్క్ఫోర్స్ ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు.
2023 ఎన్నికల సమయంలో ట్యాపింగ్ బాధితుల్లో బిఆర్ఎస్ నేతలు,ఎంఎల్ఎల కూడా ఉన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి ఫోన్లు ట్యాప్ చేశారని సిట్ ఇప్పటికే ఆధారాలు సేకరించింది.





More Stories
మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
హైదరాబాద్ లో దేశీయ తొలి ప్రైవేట్ రాకెట్