పాక్‌ మహిళతో పెళ్లిని దాచిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌

పాక్‌ మహిళతో పెళ్లిని దాచిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌
హహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్థానీల వీసాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్‌) కానిస్టేబుల్ ఉద్యోగం ఊడిపోయింది. ఇందుకు అతడి భార్యే కారణం అయింది. సదరు కానిస్టేబుల్ భార్య పాకిస్తానీ కావటంతో అధికారులు ఆమె భర్తను ఉద్యోగంలోంచి తీసేసారు.

ఆ జవాన్‌ ప్రవర్తన జాతీయ భద్రతకు హానికరమని సీఆర్పీఎఫ్‌ ఆరోపించింది. సీఆర్పీఎఫ్‌ 41వ బెటాలియన్‌కు చెందిన జవాన్‌ మునీర్ అహ్మద్‌కు రెండున్నర నెలల కిందట పాకిస్థాన్‌ మహిళ మినాల్ ఖాన్‌తో ఆన్‌లైన్‌లో పెళ్లి జరిగింది. జమ్మూకు చెందిన అహ్మద్ అనే వ్యక్తి 2017లో సీఆర్‌పీఎఫ్‌లో జాయిన్ అయ్యాడు. 

సంవత్సరం క్రితం అతడు ఉన్నతాధికారులకు ఓ లేఖ రాశాడు. ఆ లేఖలో తాను పాకిస్తాన్‌కు చెందిన మునాల్ ఖాన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు. అధికారులనుంచి పెళ్లికి ఆమోదం రాకుండానే పాకిస్తానీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 2024 మే నెలలో ఇద్దరూ వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకున్నారు. మునాల్ టూరిస్టు వీసా ద్వారా ఇండియాకు వచ్చింది.

అప్పటినుంచి మునాల్, అహ్మద్ కలిసే ఉంటున్నారు. వీసా తేదీ మార్చి 22తో ముగిసిపోయింది.  దీర్ఘకాలిక వీసా కోసం దరఖాస్తు చేసింది. సీఆర్పీఎఫ్‌ జవాన్‌ అయిన భర్త మునీర్ అహ్మద్‌తో కలిసి జమ్మూలో ఆమె నివసిస్తున్నది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకీస్తానీల వీసాలు రద్దు చేయటంతో మునాల్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వీసా గడువు ముగిసిన పాక్‌ మహిళ మినాల్ ఖాన్‌ను దేశం నుంచి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆమె జమ్ముకశ్మీర్‌ హైకోర్టును ఆశ్రయించింది. అధికారులు పంపడంతో పాక్‌ తిరిగి వెళ్లేందుకు భర్తతో కలిసి జమ్మూ నుంచి పంజాబ్‌లోని అట్టారి సరిహద్దుకు చేరుకున్నది.

మరోవైపు పాక్‌ మహిళ మినాల్ ఖాన్‌కు చివరి నిమిషంలో దేశ బహిష్కరణ నుంచి జమ్ముకశ్మీర్‌ హైకోర్టు ఊరట ఇచ్చింది. ఆమెను అట్టారి నుంచి జమ్మూకు పంపాలని ఏప్రిల్‌ 30న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరో 10 రోజులు ఆమె ఇండియాలో ఉండటానికి అవకాశం ఇచ్చింది. అయితే, అహ్మద్ పెళ్లి విషయం సీఆర్‌పీఎఫ్ అధికారులకు తెలిసింది. అనుమతి లేకుండా పాకిస్తాన్‌కు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు అతడిపై చర్యలు చేపట్టారు.