చార్దామ్ యాత్రికులు ఆన్ లైన్ మోసాలపై జాగ్రత్త

చార్దామ్ యాత్రికులు ఆన్ లైన్ మోసాలపై జాగ్రత్త
దేశవ్యాప్తంగా చార్దామ్ యాత్రికులు, పర్యాటకులు లక్ష్యంగా జరుగుతున్న ఆన్ లైన్ మోసాలపై ప్రజలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆన్లైన్ బుకింగ్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సూచించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

నకిలీ వెబ్ సైట్లు, మోసపూరిత సోషల్ మీడియా పేజీలు, ఫేస్‌ బుక్ పోస్టులు, గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లలో చెల్లింపు ప్రకటనల ద్వారా ఆన్ లైన్ మోసాలు జరుగుతున్నాయని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రొఫెషనల్‌ గా కనిపించే నకిలీ వెబ్ సైట్లు, సోషల్ మీడియా ప్రొఫైల్స్, వివిధ సేవలను అందించే వాట్సాప్ ఖాతాలను క్రియేట్ చేసి సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. 

కేదార్నాథ్ కోసం హెలికాప్టర్ బుకింగ్స్, చార్ ధామ్ యాత్రికుల కోసం గెస్ట్ హౌస్, హోటల్ బుకింగ్స్, ఆన్లైన్ క్యాబ్, టాక్సీ రిజర్వేషన్, హాలిడే ప్యాకేజీలు, మతపరమైన పర్యటనల్లో కేటుగాళ్లు ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించింది. “ఏదైనా చెల్లింపులు చేసే ముందు వెబ్సైట్ల ప్రామాణికతను ఎల్లప్పుడూ ధ్రువీకరించండి. గూగుల్, ఫేస్ బుక్, వాట్సాప్ లో ‘స్పాన్సర్డ్’ లేదా తెలియని లింక్లపై క్లిక్ చేసే ముందు వెరిఫై చేసుకోండి. అధికారిక ప్రభుత్వ పోర్టల్స్, విశ్వసనీయ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా మాత్రమే బుకింగ్‌ లను క్రాస్ చెక్ చేయండి” అని సూచించింది. 

“ఏదైనా మోసం జరిగితే cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి. లేదా 1930కి కాల్ చేయండి. కేదార్‌నాథ్కు హెలికాప్టర్ బుకింగ్‌ కోసం heliyatra.irctc.co.in వైబ్సైట్ను సందర్శించండి. సోమనాథ్ ట్రస్ట్ అధికారిక వెబ్సైట్ somnath.orgలో గెస్ట్ హౌస్ బుకింగ్‌ చేసుకోండి” అని కేంద్ర హోం శాఖ ప్రకటన విడుదల చేసింది.

ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ బహుముఖ వ్యూహాన్ని అవలంభిస్తోంది. సైబర్ నేరాల హాట్‌ స్పాట్లను గుర్తిస్తోంది. ఈ క్రమంలో సైబర్ మోసాలు జరిగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తుంది. ఆన్లైన్ ఫ్రాడ్ల నుంచి ప్రజలను రక్షించడానికి నకిలీ వెబ్సైట్లు, ప్రకటనలు, నకిలీ సోషల్ మీడియా ఖాతాల యాక్సిస్ ను నిలిపివేస్తోంది.