
పాఠశాలల్లో ఏకపక్షంగా ఫీజుల పెంపుపై ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. స్కూల్ ఫీజులు పెంపును ఏ మాత్రం సహించేది లేదని ముఖ్యమంత్రి రేఖా గుప్తా హెచ్చరించారు. పాఠశాలల్లో ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టడంతో మోడల్ టౌన్ లోని క్వీన్ మేరీ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను వేధింపులకు గురి చేసింది.
అంతేకాదు పాఠశాల నుంచి బహిష్కరించింది. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీఎం రేఖా గుప్తా తీవ్రంగా స్పందించారు. పాఠశాలల్లో అడ్డగోలుగా ఫీజులు పెంచడం, విద్యార్థులు, తల్లిదండ్రులను వేధించడం వంటి చర్యలను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. అలా చేస్తే పాఠశాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని ఆమె హెచ్చరించారు.
‘ఫీజుల పెంపు విషయంలో పాఠశాల యాజమాన్యాలు కొన్ని నియమ, నిబంధనలు పాటించాలి. అసాధారణంగా ఫీజులు పెంచరాదు. విద్యార్థులను వేధించకూడదు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవు. ఫిర్యాదులు అందిన పాఠశాలలకు నోటీసులు పంపుతాం. ఆయా పాఠశాలల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం’ అని సీఎం రేఖా గుప్తా తీవ్రంగా హెచ్చరించారు.
పిల్లల హక్కులను కాపాడటానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. ఏ విధమైన దోపిడీ, అన్యాయాలు, అక్రమాలను జీరో టాలరెన్స్ విధానంతో పరిష్కరిస్తాం అని స్పష్టం చేశారు. ప్రతి బిడ్డకు న్యాయం, గౌరవం, న్యాయమైన విద్య లభించాలని తెలిపారు. అంతేకాదు క్వీన్ మేరీ స్కూల్ ఘటనపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు తక్షణమే దర్యాప్తు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
More Stories
ఎట్టకేలకు మహిళా జర్నలిస్టులను ఆహ్వానించిన ఆఫ్ఘన్ మంత్రి!
`ఆపరేషన్ బ్లూ స్టార్’ పొరపాటు.. ఇందిరను కోల్పోవాల్సి వచ్చింది
భారత్ తో సంబంధం ఎంతో విలువైనదిగా భావిస్తున్న అమెరికా