బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ మృతి

బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్  మృతి
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం, వయోభారంతో ముంబైలోని కోకిలాబెన్‌ ధీరుభాయ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయ‌న క‌న్నుమూశారు. దేశ భ‌క్తి చిత్రాల‌కి ఆయ‌న బాగా ప్రఖ్యాతి చెందారు.  తన విలక్షణ నటన, దర్శకత్వంతో బాలీవుడ్‌ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. మనోజ్‌కుమార్‌ మృతితో భారతీయ సినిమా ఒక యుగాన్ని కోల్పోయిందని పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు.
మనోజ్ కుమార్ పూర్తి పేరు హరికృష్ణ గిరి గోస్వామి.  1937 జులై 24వ తేదీన బ్రిటిష్ ఇండియాలోని అబాటాబాద్‌లో (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) జన్మించారు. 1947లో దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారతదేశానికి వలస వచ్చింది. 1957లో ‘ఫ్యాషన్’ చిత్రంతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.  ‘హరియాలీ ఔర్ రాస్తా’ (1962), ‘షహీద్’ (1965) వంటి చిత్రాలతో గుర్తింపు సాధించారు. 1967లో విడుదలైన ‘ఉప్కార్’ చిత్రం ఆయనకు ‘భారత్ కుమార్’ అనే బిరుదు వచ్చింది. ఈ చిత్రం తర్వాత ఆయన దేశభక్తి ఆధారిత చిత్రాలను ఎక్కువగా దర్శకత్వం వహించారు.

‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ (1970), ‘రోటీ కపడా ఔర్ మకాన్’ (1974), ‘క్రాంతి’ (1981) తదితర సినిమాలతో మనోజ్ కుమార్ దేశ సామాజిక సమస్యలను, జాతీయ భావాలను తట్టి లేపారు. ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చాయి. ఆయన రచయితగా, దర్శకుడిగా, నటుడిగా తన సత్తాను చాటారు.

1999లో నటన‌కి దూరం అయ్యారు మ‌నోజ్ కుమార్. ఆయ‌న ఎన్నో అవార్డులు అందుకున్నారు.  1992లో భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2016లో ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది, ఇది భారతీయ సినిమాకు అత్యున్నత పురస్కారం. మనోజ్ కుమార్ దేశభక్తి చిత్రాల ద్వారా యువతలో జాతీయ భావాన్ని పెంపొందించారు. “మేరే దేశ్ కీ ధర్తీ” వంటి పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచాయి. ఆయన చిత్రాలు సామాజిక సందేశాలను అందించడంలో ప్రత్యేక శైలితో కూడినవి. 

చిత్ర రంగంలో ఆయన సహచరుడైన దర్శకుడు అశోక్ పండిత్ మాట్లాడుతూ మనోజ్ కుమార్ మా స్ఫూర్తి ప్రదాత. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఒక సింహంలా నిలిచి దేశభక్తిని సినిమా ద్వారా చాటారని కొనియాడారు. మనోజ్ కుమార్ గత కొన్నేళ్లుగా వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆయన భార్య షషి గోస్వామి, కుమారుడు విశాల్, కుమార్తె కాజల్‌తో కుటుంబం ఉన్నారు. మనోజ్ కుమార్ మరణ వార్త తెలిసిన వెంటనే బాలీవుడ్‌తో పాటు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో స్పందిస్తూ, “మనోజ్ కుమార్ గారి మరణం దేశానికి గొప్ప నష్టం. ఆయన చిత్రాలు భారతీయ విలువలను, సంస్కృతిని ప్రపంచానికి చాటాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను,” అని తెలిపారు. నటుడు అక్షయ్ కుమార్, “మనోజ్ గారు నాకు దేశభక్తి చిత్రాల్లో స్ఫూర్తి. ఆయన వారసత్వం ఎప్పటికీ ఉంటుంది,” అని కొనియాడారు.

ఆయన చిత్రాలు ఈనాటి యువతలోనూ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మనోజ్ కుమార్‌ చిత్రాల్లోని సందేశాలు, దేశ ప్రేమ, స్ఫూర్తితో వచ్చాయి. ఈ చిత్రాలు ఎన్నో తరాలను ఆకట్టుకున్నాయి. ఆయన అభిమానులు, సినీ ప్రియులు ముంబైలోని ఆయన నివాసం వద్దకు చేరుకుని చివరి వీడ్కోలు పలుకుతున్నారు.